Telugu Global
Telangana

బీజేపీ, కాంగ్రెస్‌కు మానుకోట దమ్మేంటో చూపించండి.. - మంత్రి హరీష్ రావు

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో ప్రచారం నిర్వహించి 5 గ్యారంటీలు అంటూ.. ఊదరగొట్టి ప్రజలతో ఓట్లు వేయించుకొని చివరికి మోసం చేశారని తెలిపారు.

బీజేపీ, కాంగ్రెస్‌కు మానుకోట దమ్మేంటో చూపించండి.. - మంత్రి హరీష్ రావు
X

ఓట్ల కోసం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మానుకోట దమ్మేంటో చూపించాలని మంత్రి హరీష్ రావు ఆ నియోజకవర్గ ప్రజలను కోరారు. ఇవాళ ఆయన మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్‌కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజున మానుకోట ప్రజలు వారిని తరిమికొట్టారని, ఆ దెబ్బకు సమైక్యవాదులంతా వెనక్కి పరిగెత్తారని చెప్పారు.

మానుకోట మట్టికి, రాళ్లకు దండం పెడుతున్నట్లు హరీష్ రావు తెలిపారు. సమైక్యవాదులకు చూపించిన ద‌మ్మే.. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చూపాలని, మానుకోట ప‌వ‌ర్ ఏంటో చూపించాలని కోరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో ప్రచారం నిర్వహించి 5 గ్యారంటీలు అంటూ.. ఊదరగొట్టి ప్రజలతో ఓట్లు వేయించుకొని చివరికి మోసం చేశారని తెలిపారు. ఇప్పుడు ఇక్కడ కూడా 6 గ్యారంటీలు అంటూ ప్రచారం చేస్తున్నారని, వారిని నమ్మి ఓటేస్తే మోసపోవడం ఖాయమ‌న్నారు.

రేవంత్ రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాలా..? అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో కరెంటు లేక రైతులు తిప్పలు పడుతున్నారని.. కాంగ్రెస్ కావాలో.. కరెంట్ కావాలో.. ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. రైతులను బిచ్చగాళ్లు అన్న రేవంత్ రెడ్డికి రైతుల గుణపాఠం చెప్తారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చామని, రుణమాఫీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హరీష్ రావు వెల్లడించారు.

First Published:  25 Nov 2023 1:09 PM GMT
Next Story