Telugu Global
Telangana

ఆ రెండు వర్గాలను గవర్నర్ అవమానించారు

బీజేపీలో ఉండి తమిళిసై మాత్రం గవర్నర్‌ కావచ్చు, కానీ కుర్రా సత్యనారాయణ మాత్రం బీఆర్‌ఎస్‌ లో ఉండి ఎమ్మెల్సీ కాకూడదా? అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు.

ఆ రెండు వర్గాలను గవర్నర్ అవమానించారు
X

రాజకీయాలనుంచి వచ్చిన తమిళిసై గవర్నర్ కావొచ్చు.. కానీ ఎరుకల జాతి నుంచి వచ్చినవారు, విశ్వ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు ఎమ్మెల్సీలు కాకూడదా అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన ఇద్దరిని ఎమ్మెల్సీలు కాకుండా అడ్డుకున్నారంటూ ఆయన గవర్నర్ పై మండిపడ్డారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తిరస్కరించడం కరెక్ట్‌ కాదని అన్నారు. ఎరుకల జాతి, విశ్వ బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చినా గవర్నర్ అడ్డుకున్నారని చెప్పారు. దేశంలో గవర్నర్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు.

"బీజేపీ ప్రభుత్వం ఎరుకల జాతిని రిజెక్ట్‌ చేసింది.. మీరంతా బీజేపీకి గుణపాఠం చెప్పాల"ని పిలుపునిచ్చారు హరీష్ రావు. బీజేపీలో ఉండి తమిళిసై మాత్రం గవర్నర్‌ కావచ్చు, కానీ కుర్రా సత్యనారాయణ మాత్రం బీఆర్‌ఎస్‌ లో ఉండి ఎమ్మెల్సీ కావద్దా? అని ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం అదే..

సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని హరీష్ రావు ప్రారంభించారు. 175 సీట్లు ఉన్న సిద్దిపేట మెడికల్ కాలేజీలో 25 శాతం సీట్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారికి కేటాయిస్తామని తెలిపారాయన. ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి విద్యార్థులు మన రాష్ట్రానికి వచ్చి చదువుకుంటారంటే.. తెలంగాణ అభివృద్ధికి అదే నిదర్శనం అని చెప్పారు. గతంలో సిద్దిపేట నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పంపించేవారని. కానీ ఇకపై ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు హరీష్ రావు.

First Published:  5 Oct 2023 2:41 PM GMT
Next Story