Telugu Global
Telangana

ఆరోజు నాన్ వెజ్ అమ్మ‌కాలపై నిషేధం.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వివాదాస్ప‌ద నిర్ణ‌యంపై అస‌దుద్దీన్ ఒవైసీ ఆగ్ర‌హం..

అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం సంపన్నవర్గాలకు కొమ్ముకాసే సర్కార్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆరోజు నాన్ వెజ్ అమ్మ‌కాలపై నిషేధం.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వివాదాస్ప‌ద నిర్ణ‌యంపై అస‌దుద్దీన్ ఒవైసీ ఆగ్ర‌హం..
X

మొన్న కృష్ణాష్ట‌మికి నాన్ వెజ్ అమ్మ‌కాల‌పై నిషేధం విధించిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం.. ఇప్పుడు వినాయ‌క‌ చ‌వితి విష‌యంలోనూ నాన్ వెజ్ అమ్మ‌కాల‌ను నిషేధిస్తూ ఆదేశాలిచ్చింది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగస్టు 31వ తేదీన బెంగళూరు నగరంలో మాంసం విక్రయాలు నిషేధిస్తూ `బృహత్ బెంగళూర్ మహానగర పాలికె` నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రభుత్వం వివాదాస్ప‌ద నిర్ణ‌యంపై ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిప‌డ్డారు.

వినాయక చవితి రోజు మాంసం విక్రయాలతో పాటు జంతు వధను నిషేధించామని, ఈ ఉత్తర్వులు బృహత్ బెంగళూర్ మహానగర పాలికె పరిధిలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయని అక్క‌డి అధికారులు ఆదేశాలివ్వ‌డంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం సంపన్నవర్గాలకు కొమ్ముకాసే సర్కార్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దృష్టిలో ఈ నిర్ణయం మంచిదే కావచ్చు.. కానీ ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మందికి ఇబ్బంది కలిగిస్తుందని ఆయ‌న తెలిపారు.

బెంగళూరులో వినాయక చవితి సందర్భంగా మాంసం విక్రయాలు నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని ఒవైసీ పేర్కొన్నారు. మాంసం విక్రయాలపై నిషేధం విధించడం వృత్తి హక్కును నిరాకరించడంతో పాటు జీవనోపాధి, స్వేచ్ఛ‌ వంటి హక్కులను కాలరాయడమేనని స్ప‌ష్టం చేశారు.

కర్ణాటకలో ఎక్కువగా ఈ వ్యాపారం చేసేది ముస్లింలేనని, అందుకే బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. క‌ర్ణాట‌క‌లో 80 శాతం మంది మాంసాహారులు ఉన్నారని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఐటీ నగరం బెంగళూరులో మాంసం విక్రయాలు నిలిపివేసి ప్రపంచానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని కర్ణాటక ప్రభుత్వాన్ని ఒవైసీ ప్రశ్నించారు. గతంలో కృష్ణాష్ణమి సందర్భంగా కూడా బృహత్ బెంగళూర్ మహానగర పాలికె పరిధిలో మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

First Published:  30 Aug 2022 3:16 AM GMT
Next Story