Telugu Global
Telangana

సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగా యాత్ర - అసదుద్దీన్

సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ లో విలీనమైన రోజు అని, అది విమోచన దినం కాదని తెలిపారు అసదుద్దీన్ ఒవైసీ. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలన్న కేంద్ర నిర్ణయంతో తాము ఏకీభవించడంలేదని చెప్పారు.

సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగా యాత్ర - అసదుద్దీన్
X

సెప్టెంబరు 17న హైదరాబాద్‌ పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహిస్తామని తెలిపారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆ కార్యక్రమంలో పాల్గొంటారని, సీఎం కేసీఆర్ ని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత వజ్రోత్సవాల దినంగా ప్రకటించాలన్న తమ అభ్యర్థనను అంగీకరించిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు అసదుద్దీన్. తిరంగా యాత్ర అనంతరం బహిరంగ సభ ఉంటుందని ప్రకటించారు.

సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ లో విలీనమైన రోజు అని, అది విమోచన దినం కాదని తెలిపారు అసదుద్దీన్ ఒవైసీ. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలన్న కేంద్ర నిర్ణయంతో తాము ఏకీభవించడంలేదని చెప్పారు. విమోచన అనే ప్రస్తావన లేకుండా, సెప్టెంబర్‌ 17న జాతీయ సమగ్రత దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. ఈమేరకు విమోచన దినోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు లేఖలు రాశామని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే జాతీయ సమైక్యత దినాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.

అందరి పోరాట ఫలితం..

హైదరాబాద్‌ సంస్థానం విలీనం కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారని గుర్తు చేశారు అసదుద్దీన్ ఒవైసీ. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. పాతబస్తీలో తమ పార్టీ ఆధ్వర్యంలో తిరంగాయాత్ర చేపడతామన్నారు. మతాలకతీతంగా ప్రజలంతా ఈ యాత్రలో పాల్గొంటారని చెప్పారు. ఆ తర్వాత బహిరంగ సభలో త్యాగధనుల కీర్తిని స్మరించుకుంటామన్నారు అసదుద్దీన్ ఒవైసీ.

First Published:  4 Sep 2022 2:52 AM GMT
Next Story