Telugu Global
Telangana

తెగుళ్లు, అకాల వర్షాల కారణంగా తెలంగాణలోని మామిడి రైతులకు ఈ సారి రెట్టింపు నష్టాలు

తెగుళ్లు, అకాల వర్షాలు, వడగళ్ల వాన రైతుల ఆశ‌లను దెబ్బతీశాయి. చీడపీడల కారణంగా పూల నుంచి ఫలాలుగా మారడం బాగా దెబ్బతిందని కొల్హాపూర్‌కు చెందిన మామిడి రైతు శివశంకర్ తెలిపారు.

తెగుళ్లు, అకాల వర్షాల కారణంగా తెలంగాణలోని మామిడి రైతులకు ఈ సారి రెట్టింపు నష్టాలు
X

ఈసారి సీజన్‌లో తెగుళ్లు, అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని చాలా మంది మామిడి రైతులు పెద్ద నష్టాన్నే చవిచూడబోతున్నారు.

వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో కనీసం 20 నుంచి 30 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గతేడాది 3.07 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేయగా ఈ ఏడాది 2.89 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు.

ఈ సారి సీజన్ సానుకూలంగానే ప్రారంభమైంది. జనవరి నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం, పూత బాగా రావడంతో దిగుబడిపై రైతులు భారీ ఆశ‌నే పెట్టుకున్నారు.

అయితే తెగుళ్లు, అకాల వర్షాలు, వడగళ్ల వాన రైతుల ఆశ‌లను దెబ్బతీశాయి. చీడపీడల కారణంగా పూల నుంచి ఫలాలుగా మారడం బాగా దెబ్బతిందని కొల్హాపూర్‌కు చెందిన మామిడి రైతు శివశంకర్ తెలిపారు.

ఇలాంటి తెగుళ్ల దాడి గురించి వనపర్తికి చెందిన రైతు ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో తమ పొలంలో 20 టన్నుల నుంచి 15 టన్నులకు దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు.

ఇతర ప్రాంతాలలో, తెగుళ్ల కారణంగా రైతులు పెద్దగా ఇబ్బంది పడనప్పటికీ, గత వారం వర్షాలు, వడగళ్ల వాన కారణంగా గణనీయమైన నష్టాన్ని చవిచూశారు. సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, వరంగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి పెద్ద ఎత్తున పూత వచ్చిందని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. గతేడాది 10.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రాగా, ఈ ఏడాది 14 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని అంచనా వేశారు.

అయితే ఈ మధ్య‌ కురిసిన భారీ వర్షాలు, వడగళ్ల వాన కారణంగా రైతులు భారీగా నష్టపోయినట్లు సమాచారం. పంట నష్టాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక సమర్పించేందుకు వివిధ జిల్లాలకు టీంలను పంపినట్లు ఉద్యానవన శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

రాష్ట్రంలో 10 నుంచి 12 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి ఉత్పత్తి జరుగుతుండగా, అందులో 19,000 నుంచి 20,000 టన్నులు మాత్రమే దేశీయ మార్కెట్లలో వినియోగిస్తుండగా, మిగిలినవి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

తెలంగాణకు చెందిన బెనేషన్, హిమాయత్ రకాలు ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అంతే కాకుండా ఇక్కడి పళ్ళను గల్ఫ్ దేశాలు, చైనా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.

First Published:  20 March 2023 1:52 AM GMT
Next Story