Telugu Global
Telangana

బీజేపీ గెలిస్తే బండి సంజయ్ సీఎం..!

బండి సంజయ్ సామాన్యుడు కాదని, యుద్ధవీరుడని, ఆయనకు మోదీ అండగా ఉన్నారని కొనియాడారు మందకృష్ణ మాదిగ.

బీజేపీ గెలిస్తే బండి సంజయ్ సీఎం..!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పారు అధినేతలు. అయితే ఆ బీసీ ఎవరో మాత్రం వివరించలేదు. ఎలాగూ గెలవలేమని డిసైడ్ అయిన తర్వాతే బీసీ సీఎం అనే కొత్త పల్లవి అందుకున్నారని బీజేపీపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. బీసీ కార్డు ఉపయోగించి, బీసీ ఓట్లు కొల్లగొట్టాలనే పథకంతోనే బీసీ సీఎం అంటున్నారని వైరి వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఈ క్రమంలో బీసీ అండే బండి అని క్లారిటీ ఇచ్చారు మందకృష్ణ మాదిగ.

మందకృష్ణ బీజేపీ నేత కాదు, బీజేపీ అంతర్గత వ్యవహారాల గురించి సాధికారికంగా చెప్పే అధికార ప్రతినిధి కూడా కాదు. కానీ ఇటీవల ఆయన బీజేపీ నేతలతోపాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ఇచ్చిన హామీతో సంతృప్తి చెందిన మందకృష్ణ.. తమ వర్గం ఓట్లన్నీ బీజేపీకి వేయాలని చెబుతున్నారు. తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కరీంనగర్ బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. బండి సంజయ్ సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ సామాన్యుడు కాదని, యుద్ధవీరుడని, ఆయనకు మోదీ అండగా ఉన్నారని కొనియాడారు మందకృష్ణ మాదిగ. ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పదేళ్లుగా తెలంగాణ నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపించారు. పొరపాటున కాంగ్రెస్‌ కు ఓటు వేస్తే పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంటుందన్నారు. దేశ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మందకృష్ణ. పనిలో పనిగా బీజేపీకి ఓటు వేస్తే బండి సంజయ్ సీఎం అవుతారని కూడా చెప్పేశారు. బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణలో బీసీ సీఎం అంటోందే కానీ, సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు. తేల్చాల్సిన అవసరం లేదని అధినాయకులు అనుకుంటున్నారు. ఈ దశలో బండి సీఎం అంటూ ఈటల వర్గాన్ని రెచ్చగొట్టారు మందకృష్ణ.



First Published:  28 Nov 2023 7:35 AM GMT
Next Story