Telugu Global
Telangana

బీజేపీ తరపున మందకృష్ణ ప్రచారం..

బీసీ సీఎం అంటూ ఇప్పటికే బీసీ ఉపకులాలకు గేలం వేసింది బీజేపీ. ఇప్పుడు వర్గీకరణకు సై అంటూ మాదిగ వర్గం ఓట్లను గుంపగుత్తగా తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది. అందుకే ఆ వర్గం ఓట్లను టార్గెట్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ప్రచార బరిలో దింపుతోంది.

బీజేపీ తరపున మందకృష్ణ ప్రచారం..
X

మోదీ హయాంలో ఎస్సీ వర్గీకరణ పూర్తవుతుందా లేదా అనే విషయం పక్కనపెడితే.. బహిరంగ వేదికపై వర్గీకరణకు తాము సిద్ధమేనన్న ఆయన మాటలు మాత్రం ఆయా వర్గాలకు సంతోషాన్నిచ్చాయి. కమిటీలతో కాలయాపన చేసేందుకు మరోసారి మోదీ ఎత్తుగడ వేశారని కొంతమంది విమర్శిస్తున్నా.. మందకృష్ణ మాదిగ మాత్రం మోదీని ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు బీజేపీకి మద్దతుగా ప్రచార రంగంలోకి కూడా ఆయన దిగబోతున్నారు. నియోజకవర్గాల వారీగా మందకృష్ణ మాదిగతో సభలు నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.

బీసీ సీఎం అంటూ ఇప్పటికే బీసీ ఉపకులాలకు గేలం వేసింది బీజేపీ. ఇప్పుడు వర్గీకరణకు సై అంటూ మాదిగ వర్గం ఓట్లను గుంపగుత్తగా తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది. అందుకే ఆ వర్గం ఓట్లను టార్గెట్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ప్రచార బరిలో దింపుతోంది. బీజేపీ మేనిఫెస్టో విడుదల తర్వాత మందకృష్ణ సభలు మొదలవుతాయని అంటున్నారు.

తెలంగాణలో మాదిగ వర్గం ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లోనే కాకుండా జనరల్ సీట్లలో సైతం వారి భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. అందుకే బీజేపీ మందకృష్ణ సపోర్ట్ కోరుతోంది. వర్గీకరణకు మోదీ ఒప్పుకున్నారు కాబట్టి.. ఆయన కూడా తమ మద్దతు బీజేపీకేనని అదే వేదికపై చెప్పారు. తమలో ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈసారి బీజేపీకే ఓటు వేస్తామన్నారు. ఇప్పుడు నేరుగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మందకృష్ణ మాదిగ ప్రచారానికి రాబోతున్నారు.

First Published:  15 Nov 2023 3:40 AM GMT
Next Story