Telugu Global
Telangana

ప్రాణం తీసినోళ్లే, నాణెం విడుదలకు వెళ్లారు -లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో సైలెంట్ గా ఉన్నానని, ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టనని చెప్పారు లక్ష్మీపార్వతి. చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ.. అందరినీ బయటకు లాగుతానని, వచ్చే ఎన్నికల తరువాత వాళ్ళు రాజకీయాల్లో లేకుండా చేస్తానని శపథం చేశారు.

లక్ష్మీపార్వతి
X

లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్ కి నేను భార్యను కానా..? ఒకవేళ నేను భార్యను కాకపోతే ఆయనకు ఇల్లీగల్ గా ఉన్నానా..? అలా నన్ను ఇల్లీగల్ గా పెట్టుకున్న అతను యుగపురుషుడేనా..? మీరే సమాధానం చెప్పండి అంటూ మీడియా ముందు ప్రశ్నల వర్షం కురిపించారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి తనను పిలవకుండా అవమానించారని మండిపడ్డారు. అది ప్రభుత్వ కార్యక్రమమా, ప్రైవేటు కార్యక్రమమా అని ప్రశ్నించారు. ప్రాణం తీసినోళ్లంతా నాణెం విడుదలకు వెళ్లారని, చివరి రోజుల్లో ఆయనకు తోడుగా ఉన్న తనను మాత్రం ఇప్పుడు పక్కనపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భార్య అని మెడలో బోర్డ్ వేసుకుని తిరగాలా అని ప్రశ్నించారు లక్ష్మీపార్వతి.

పురందేశ్వరి..! నిన్నొదల

తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు కుటుంబ సభ్యులగా చెలామణి అవుతున్నారని, పురందేశ్వరి దుర్మార్గురాలని మండిపడ్డారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ కొడుకులు అమాయకులని, కూతుళ్లు పురందేశ్వరి, భువనేశ్వరి దుర్మార్గులని అన్నారు. చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి కుట్ర చేస్తున్నారని చెప్పారు. పురందేశ్వరి తిరిగిన‌ ప్రతి నియోజకవర్గంలో తాను తిరుగుతానని, బీజేపీకి ఒక్క సీటు కూడా రాకుండా ప్రచారం చేస్తానన్నారు. కొడుకులు, కూతుళ్ల గురించి ఎన్టీఆర్ ఏమన్నారో మరోసారి ప్రజలకు వివరిస్తానని చెప్పారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో సైలెంట్ గా ఉన్నానని, ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టనని చెప్పారు. చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ.. అందరినీ బయటకు లాగుతానని, వచ్చే ఎన్నికల తరువాత వాళ్ళు రాజకీయాల్లో లేకుండా చేస్తానని శపథం చేశారు.

తనను చులకన చేస్తే ఎన్టీఆర్ ని చేసినట్టేనని అన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ కష్టాల్లో ఉంటే తాను సేవ చేశానని, అప్పుడు పురందేశ్వరి వచ్చారా, ఇంకెవరైనా వచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవడానికి ఇంటర్నల్ గా పురందేశ్వరి ప్రధాన కారకురాలని చెప్పారు. తండ్రిపై కోపంతో పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని, కేంద్ర మంత్రిగా ఉండి అవినీతి చేశారని మండిపడ్డారు. ‘‘నాకు జరిగిన అవమానం నీకు ఏదో‌ ఒక రోజు జరుగుతుంది. ఈ రోజు నుంచి నా పోరాటం నీ మీదే’’ అంటూ పురందేశ్వరికి శాపనార్థాలు పెట్టారు లక్ష్మీపార్వతి.


First Published:  28 Aug 2023 9:19 AM GMT
Next Story