Telugu Global
Telangana

తెలంగాణకు కావాల్సింది ధిక్కార స్వరాలు

కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న రాకేష్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులకు సూచించారు కేటీఆర్.

తెలంగాణకు కావాల్సింది ధిక్కార స్వరాలు
X

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదని, ధిక్కార స్వరాలని పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలని చెప్పారు. ఖ‌మ్మం-వ‌రంగ‌ల్- న‌ల్ల‌గొండ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాల‌ని కోరుతూ కేటీఆర్ ట్వీట్ వేశారు. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేష్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. యువత గొంతుకగా ఆయన నిలుస్తారని నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి ప్రస్థానాన్ని కూడా తన ట్వీట్ లో వివరించారు కేటీఆర్. హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో రాకేష్ రెడ్డి జన్మించారని, ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో విద్యాభ్యాసం చేశారని, మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్‌లో ఆయన డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని చెప్పారు కేటీఆర్. అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి.. ప్రజా సేవకోసం తెలంగాణకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారని కేటీఆర్ తెలిపారు.

సమకాలీన రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై వార్తా పత్రికలకు ఆర్టికల్స్ రాయడంతోపాటు సొంతగా ఆయన పలు పుస్తకాలు రచించారు. నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిస్కల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలతో పాఠకులకు దగ్గరయ్యారు. సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చేవారు రాకేష్ రెడ్డి. కరోనా మహమ్మారి సమయంలో, వరంగల్ లో వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రజలకు అండగా ఉన్నారని చెప్పారు కేటీఆర్. కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న రాకేష్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులకు సూచించారు కేటీఆర్.

First Published:  18 May 2024 2:53 PM GMT
Next Story