Telugu Global
Telangana

9 ఛానెళ్లకు లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్..

మహా న్యూస్, ఐ న్యూస్, సీఆర్ వాయిస్, మన తొలి వెలుగు టీవీ, మనం టీవీ, పాలిట్రిక్స్, రేవంత్ దండు, వైల్డ్ వుల్ఫ్ న్యూస్, రెడ్ టీవీ ఈ లిస్ట్ లో ఉన్నాయి.

9 ఛానెళ్లకు లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్..
X

తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇటీవల టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లకు వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్.. ఇప్పుడు లీగల్ నోటీసులు పంపించారు. మొత్తం 9 మీడియా ఛానెళ్లకు లీగల్ నోటీసులు పంపించారాయన. మహా న్యూస్, ఐ న్యూస్, సీఆర్ వాయిస్, మన తొలి వెలుగు టీవీ, మనం టీవీ, పాలిట్రిక్స్, రేవంత్ దండు, వైల్డ్ వుల్ఫ్ న్యూస్, రెడ్ టీవీ ఈ లిస్ట్ లో ఉన్నాయి.


గతంలో కూడా కేటీఆర్ ఇలాగే పలు సంస్థలకు లీగల్ నోటీసులు పంపించగా.. తమ తప్పును సరిదిద్దుకొని, అసత్య పూరిత వీడియోలను తీసివేస్తున్నామని ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇప్పడు మరో 9 సంస్థలకు నోటీసులు పంపించారు. తమకు సంబంధం లేని విషయాలలో, తమ పేరును, ఫోటోలతో సహా ప్రస్తావిస్తున్న ప్రతి మీడియా సంస్థకు, యూట్యూబ్ ఛానల్ పై న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు కేటీఆర్.

కేవలం తనకు, తమ కుటుంబానికి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఆయా ఛానెళ్లు, మీడియా సంస్థలు, పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని కేటీఆర్ తన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ఒక పక్కా అజెండాలో భాగంగానే మీడియా ముసుగులో కుట్రలకు పాల్పడుతున్నాయని అన్నారు. అత్యంత హీనమైన థంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్న ఈ ఛానెళ్లపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామమని ఆయన తెలిపారు. వారంతా చట్ట ప్రకారం శిక్ష అనుభవించక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్ కి సైతం లీగల్ నోటీసులు పంపించామని తెలిపారు కేటీఆర్. మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్ కేవలం వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే అసత్యాలను, అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకుంటే మంచిదని కేటీఆర్ సూచించారు.

First Published:  30 March 2024 2:48 PM GMT
Next Story