Telugu Global
Telangana

కేటీఆర్, సత్యానాదెళ్ళ సమావేశం: బిజినెస్, బిర్యానీ గురించి చర్చించుకున్నామని కేటీఆర్ ట్వీట్

ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఈ రోజును ప్రారంభించడం ఆనందంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేటీఆర్, సత్యానాదెళ్ళ సమావేశం: బిజినెస్, బిర్యానీ గురించి చర్చించుకున్నామని కేటీఆర్ ట్వీట్
X

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ళతో తెలంగాణ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వారి సమావేశం గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. '' ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఈ రోజును ప్రారంభించడం ఆనందంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం'' అని తన ట్వీట్ లో కామెంట్ చేశారు. వారిద్దరు కలిసి ఉన్న ఫోటో కూడా షేర్ చేశారు.

అందులో కేటీఆర్ బిర్యానీ అనే మాట వాడటానికి ఓ ప్రత్యేకత ఉంది. అసలు దాని వెనక ఉన్న కథేంటంటే...

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్ బోట్ సాఫ్ట్‌వేర్ అయిన చాట్ జీపీటీతో సత్య నాదెళ్ల ఇటీవల ఛాట్ నిర్వహించారు. సౌత్ ఇండియాలో పాపులర్ టిఫిన్స్ ఏంటి? అని చాట్ జీపీటీని అడగ్గా.. ఇడ్లీ, వడ, దోసెతో పాటు బిర్యానీని కూడా చూపించింది. దీంతో సత్య నాదెళ్ల సీరియస్ అయ్యారు. బిర్యానీని టిఫిన్‌గా పేర్కొనడం హైదరాబాదీ అయిన తనను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీని సౌత్ ఇండియన్ టిఫిన్‌గా పేర్కొనడం వల్ల ఆ సాఫ్ట్‌వేర్ ఓ హైదరాబాదీ అయిన తన తెలివితేటలను అవమానించిదని అన్నారు. సత్య నాదెళ్ల వ్యాఖ్యలతో చాట్ జీపీటీ తన మాటలను వెనక్కి తీసుకుంది. సత్య నాదెళ్లకు వెంటనే క్షమాపణలు చెప్పింది.

ఈ సంఘటన వివరాలు సత్య నాదెళ్ళ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పాడు. ఈ కథనం వైరల్ అయ్యింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ బిజినెస్ తో పాటు బిర్యానీ గురించి కూడా మాట్లాడుకున్నామని వ్యాఖ్యానించారు.

కాగా హైదరాబాద్ ఐటీ రంగ అభివృద్ది, ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ది తదితర విషయాలను ఈనాటి సమావేశంలో కేటీఆర్, సత్యా నాదెళ్ళకు వివరించినట్టు సమాచారం.

First Published:  6 Jan 2023 7:59 AM GMT
Next Story