Telugu Global
Telangana

రోజుకి మూడు డ్రస్సులు మార్చడం అభివృద్ధి కాదు –కేటీఆర్

తెలంగాణ ప్రస్థానం దేశానికే ఆదర్శం అని చెప్పారు మంత్రి కేటీఆర్. దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ లాగా తెలంగాణ మారిందన్నారు. దేశం కడుపునింపే స్థాయికి తెలంగాణ చేరిందని వివరించారు.

రోజుకి మూడు డ్రస్సులు మార్చడం అభివృద్ధి కాదు –కేటీఆర్
X

నటించేవాడు నాయకుడు కాదు, లీనమై పనిచేసేవాడే నాయకుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం, ముచ్చట్లు చెప్పడం అభివృద్ధి కాదని అన్నారాయన. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. గుజరాత్‌ లో పైకి బిల్డప్‌ తప్ప లోపల ఏమీ ఉండదని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ విస్తరణతో దేశమంతా కదం తొక్కుతామన్నారు. నల్ల చట్టాలతో 700 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరని ప్రశ్నించారు. దుర్మార్గంగా అన్యాయంగా మాట్లాడే ఇలాంటి ప్రధాని ఎక్కడా ఉండరని అన్నారు కేటీఆర్. డిస్కంలను ఎందుకు ప్రైవేటీకరించాల్సి వచ్చిందని, మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని, కేంద్ర ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని చెప్పారు. తాము రైతు రాజ్యం కావాలంటే.. బీజేపీ కార్పొరేట్‌ రాజ్యం కావాలంటోందని అన్నారు.

తెలంగాణ ప్రస్థానం దేశానికే ఆదర్శం అని చెప్పారు మంత్రి కేటీఆర్. దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ లాగా తెలంగాణ మారిందన్నారు. దేశం కడుపునింపే స్థాయికి తెలంగాణ చేరిందని వివరించారు. తెలంగాణలో కోటి ఎకరాల పైచిలుకు మాగాణి ఉందని, తెలంగాణలో 2.02 కోట్ల మెట్రిక్‌ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. కరోనా సమయంలో 7వేల కొనుగోలు కేంద్రాలతో ధాన్యం సేకరణ చేపట్టామన్నారు.

రైతుబంధు అసాధారణ కార్యక్రమం అని, అసాధారణమైన నాయకులకే ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నారు. 65 లక్షల మంది రైతులకు సీఎం కేసీఆర్‌ 65వేల కోట్ల రూపాయలు జమ చేశారని చెప్పారు కేటీఆర్. ప్రపంచలోనే వినూత్న పథకంగా రైతుబంధు కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుందన్నారు. ఐక్యరాజ్య సమితి కూడా రైతుబంధు పథకాన్ని ప్రశంసించిందని గుర్తు చేశారు. 94వేల కుటుంబాలకు పైగా రైతు బీమాతో ఆదుకున్నామని, పార్టీలు చూడకుండా.. రాజకీయాలు చేయకుండా సాయం అందిస్తున్నామని చెప్పారు కేటీఆర్.

12వరకే సమావేశాలు..

అసెంబ్లీ బడ్జెట సమావేశాల నిర్వహణ విషయంలో ప్రతిపక్షాలు మరింత సమయం కావాలని అడిగినా.. ప్రభుత్వం 12వతేదీ వరకే సమావేశాలను పరిమితం చేశింది. ఈ నెల 5, 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 6 వ తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 8వ తేదీన బడ్జెట్‌ పై సాధారణ చర్చ జరుగుతుంది. 9 నుంచి పద్దులపై చర్చ జరుగుతుంది. ఈనెల 12తో బడ్జెట్‌ సమావేశాలు ముగుస్తాయి.

First Published:  4 Feb 2023 8:23 AM GMT
Next Story