Telugu Global
Telangana

కేరళ ప్రభుత్వం నన్ను గెంటేస్తే.. కేటీఆర్ ఆదుకున్నారు : కైటెక్స్ ఎండీ జాకబ్

సార్ మీకు పెట్టుబడి కావాలా? ఉపాధి కావాలా? అని ప్రశ్నించగా.. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఉపాధి కావాలని కేటీఆర్ చెప్పారు.

కేరళ ప్రభుత్వం నన్ను గెంటేస్తే.. కేటీఆర్ ఆదుకున్నారు : కైటెక్స్ ఎండీ జాకబ్
X

కేరళ ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడి.. బలవంతంగా నేను ఆ రాష్ట్రాన్ని వదిలి వచ్చేయాల్సిన పరిస్థితులు సృష్టించింది. ఆ రాష్ట్రం నన్ను గెంటేస్తే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదుకున్నారని కైటెక్స్ గార్మెంట్స్ ఎండీ జాకబ్ తెలియజేశారు. బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో జరిగిన సీఐఐ తెలంగాణ సదస్సుకు హాజరైన జాకబ్.. తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కేరళలో రూ.3,000 కోట్లు పెట్టుబడులు పెట్టాను. కానీ, అనుకోని పరిస్థితుల్లో అదంతా వదులుకొని బయటకు రావల్సిన పరిస్థితి ఎదురైందని చెప్పారు.

కేవలం పెట్టుబడి కోల్పోవడమే కాకుండా.. 15వేల మంది ఉద్యోగుల ఉపాధికి కూడా నష్ఠం వాటిల్లిందని జాకబ్ చెప్పారు. కేరళ ప్రభుత్వం మా విలువను గుర్తించలేక పోయిందని అన్నారు. కేరళ నుంచి బయటకు వచ్చేశాక.. నాకు అనేక రాష్ట్రాల నుంచి సీఎంలు, మంత్రులు, చీఫ్ సెక్రటరీలు కాల్ చేశారు. అయితే ఒక రోజు నాకు ఒక కాల్ వచ్చింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కాల్ చేసి.. మిమ్మల్ని నా రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాను.. మీరు రావాలి అని అన్నారు. సరే సార్.. నేను వస్తాను.. అయితే కోవిడ్ కారణంగా నేను బయటకు ప్రయాణం చేయలేను అని చెప్పాను. దాని గురించి మీరేం ఆందోళన చెందకండి.. నేను మీ కోసం ఒక ప్రైవేట్ జెట్ అరేంజ్ చేస్తానని కేటీఆర్ మాటిచ్చారు. నాకు నమ్మబుద్ది కాలేదు.. అదే విషయం అడిగాను.. మీరు నిజంగానే చెప్తున్నారా లేదా జోక్ చేస్తున్నారా అన్నాను. నేను సీరియస్‌గానే ఈ మాట చెప్తున్నానని కేటీఆర్ అన్నారు.

24 గంటల్లో నా కోసం ఫ్లైట్ పంపించారు. నాతో పాటు మరో ఎనిమిది మంది హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాము. ఆ తర్వాతి రోజే కేటీఆర్ మమ్మల్ని హెలీకాప్టర్‌లో వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు తీసుకొని వెళ్లారు. నా జీవితంలో ఒక మంత్రి దగ్గర నుంచి అలాంటి ఆతిథ్యాన్ని నేను చూడలేదు. అదే రోజు తిరిగి హైదరాబాద్ వచ్చాము. అసలు ఎవరితో మాట్లాడకుండానే.. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టాలని, 4 వేల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నానని జాకబ్ వివరించారు.

అదే రోజు సాయంత్రం కేటీఆర్ ఇంట్లో నేను ఆయనను మరోసారి కలిశాను. అప్పుడే ఆయన్ని అడిగాను.. సార్ మీకు పెట్టుబడి కావాలా? ఉపాధి కావాలా? అని ప్రశ్నించగా.. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఉపాధి కావాలని చెప్పారు. ఈ రాష్ట్రం, ప్రజల పట్ల ఆయన ఎలాంటి నిబద్ధత కలిగి ఉన్నారో.. ఆ రోజు నాకు అర్థం అయ్యిందని జాకబ్ చెప్పారు. ఆ తర్వాత రోజు నాకు ఇంకో ప్రదేశాన్ని చూపించారు. చాలా సంతోషించాను. వెంటనే నా పెట్టుబడిని రూ.2,000 కోట్లకు పెంచాను. చివరకు అగ్రిమెంట్ సమయంలో రూ.2,400 కోట్ల పెట్టుబడిని నేను పెట్టాను.

ఇక ఈ రోజు ఉదయమే తెలంగాణలో మొత్తం రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాను. అదే విషయం ఆయనకు చెప్పానని జాకబ్ వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, సంస్థలు రావడం పట్ల కేటీఆర్ కృషి ఎంతో ఉన్నదని జాకబ్ పేర్కొన్నారు.


First Published:  7 March 2023 12:21 PM GMT
Next Story