Telugu Global
Telangana

ఎన్నికలకు సిద్ధ‌మవుతున్న బీఆర్‌ఎస్.. బండిని ఇంటికి పంపించి, కరీంనగర్ ఎంపీగా వినోద్ ను గెలిపించాలని కేటీఆర్ పిలుపు

“బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌ని ఇంటికి పంపించి, వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌ను గెలిపించాల్సిన‌ సమయం ఆసన్నమైంది. అదేవిధంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ను లక్ష మెజారిటీతో గెలిపించాలి’’ అని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఎన్నికలకు సిద్ధ‌మవుతున్న బీఆర్‌ఎస్.. బండిని ఇంటికి పంపించి, కరీంనగర్ ఎంపీగా వినోద్ ను గెలిపించాలని కేటీఆర్ పిలుపు
X

బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌ని ఇంటికి పంపించి, వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌ను గెలిపించాల‌ని ఐటీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేసిన అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ.. రైతులు, వారి సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని, భారత రైతు సమితికి కూడా అని కేటీఆర్ అన్నారు.

నానిపోయి రంగు మారిన వరి ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులు విధించకుండా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారని, ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.

''బీఆర్‌ఎస్‌ రైతుల పార్టీ. రైతుల ప్రయోజనాలను కాపాడితే దేశం అభివృద్ధి చెందుతుంది. BJP ప్రభుత్వం కార్పొరేట్ దిగ్గజాలకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ.12 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేసింది. ప్రత్యర్థి పార్టీల రాజకీయ జిమ్మిక్కులకు లొంగిపోవద్దు'' అని కేటీఆర్ అన్నారు.

తాండాలలో నీటి సరఫరా గురించి అడిగినప్పుడు మహిళలు ప్రతిరోజూ తగినంత తాగునీరు సరఫరా అవుతోందని, గ‌తంలో మాదిరిగా త్రాగునీటి కోసం ఎక్కువ దూరం వెళ్లడం లేదని బదులిచ్చారని, గిరిజనుల స్వయం పాలన కోసం హుస్నాబాద్‌లో 11 తాండాలను గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు మంత్రి తెలిపారు.

''గతంలో హుస్నాబాద్ కరువు, ఎండిపోయిన భూములకు పేరుగాంచింది. భగీరథ మహర్షి లాంటి ముఖ్యమంత్రి గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మించి గోదావరి నదీ జలాలను హుస్నాబాద్‌కు తీసుకొచ్చి రైతులకు సాగునీరు అందేలా చేశారు.'' అని కేటీఆర్ అన్నారు.

''గతంలో కాంగ్రెస్ హయాంలో ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగితే తమ జీవితకాలంలో ఆ ప్రాజెక్టు పూర్తవుతుందా అని ప్రజలు భయపడేవారు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నాలుగేళ్లలో పూర్తి చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతాంగానికి ఆరు గంటల పాటు కరెంటు సరఫరా అయ్యేది, ఇప్పుడు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నాము.'' అని అన్నారు.

''నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయినప్పుడు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండగా.. నేడు రూ.1200కి పెరిగింది. స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం మొత్తం రప్పిస్తానని హామీ ఇచ్చినా ఒక్క రూపాయి కూడా వెనక్కి తీసుకురాలేదు. బదులుగా, పెద్ద నోట్ల రద్దు ద్వారా మహిళలు, చిరు వ్యాపారులతో సహా ప్రజలందరూ చాలా అసౌకర్యానికి గురయ్యారు.''అని కేటీఆర్ గుర్తుచేశారు.

''దురదృష్టవశాత్తు, కరీంనగర్‌కు చెందిన స్థానిక బిజెపి ఎంపి బండి సంజయ్ కి అభివృద్ధి పట్ల అవగాహన, ముందుచూపు లేదు. అతను ఎప్పుడూ మత రాజకీయాలలో మునిగితేలుతుంటాడు. రాజకీయ మైలేజ్ పొందడం కోసం మసీదులను తవ్వాలని ప్రకటనలు చేస్తాడు, అలాంటి ఎంపీ మనకు అవసరమా..? బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే కరీంనగర్‌కు ఐఐఐటీ వచ్చి ఉండేది.'' అని అనేక అభివృద్ధి పనులు చేపట్టేవారని మంత్రి అన్నారు.

“బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌ని ఇంటికి పంపించి, వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌ను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అదేవిధంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ను లక్ష మెజారిటీతో గెలిపించాలి’’ అని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

First Published:  5 May 2023 10:15 AM GMT
Next Story