Telugu Global
Telangana

ఆ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి -కేటీఆర్

రాజ్యాంగ పరిరక్షణే భారత సమాజంపై ఉన్న ఒకే ఒక్క బాధ్యత అని గుర్తు చేశారు. అదే అంబేద్కర్ కి నిండుమనసుతో మనమిచ్చే నిజమైన నివాళి అవుతుందని చెప్పారు కేటీఆర్.

ఆ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి -కేటీఆర్
X

రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అంబేద్కర్ ఆశయాల ప్రకారమే పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. ఆ మహనీయుడు చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితో కేసీఆర్‌ లక్షలాది మందిని సమీకరించి 14 ఏళ్లు తెలంగాణ పోరాటాన్ని నడిపించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1,022 గురుకులాలు ఏర్పాటు చేశామని, వాటి నుంచి బయటకు వచ్చిన లక్షల మంది ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారని తెలిపారు కేటీఆర్.


ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, అది విగ్రహం కాదు విప్లవం అనే మాట కేసీఆర్ ఆనాడే చెప్పారని, సచివాలయానికి ఆ మహనీయుడి పేరే పెట్టుకున్నామని అన్నారు. మహాత్మా గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా.. అవన్నీ ఆయన ఆలోచన నుంచి వచ్చినవేనన్నారు కేటీఆర్.


ఓవైపు.. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేసి వాటిని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని, మరోవైపు.. ప్రజాస్వామ్యాన్నే కాలరాసి రాజ్యాంగ సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకునే కుతంత్రాలు కూడా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కేటీఆర్. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణే భారత సమాజంపై ఉన్న ఒకే ఒక్క బాధ్యత అని గుర్తు చేశారు. అదే అంబేద్కర్ కి నిండుమనసుతో మనమిచ్చే నిజమైన నివాళి అవుతుందని చెప్పారు కేటీఆర్.

First Published:  14 April 2024 9:21 AM GMT
Next Story