Telugu Global
Telangana

మంత్రి కొప్పుల ఈశ్వర్ పిటిషన్ కొట్టివేత

ఇప్పుడు మధ్యంతర పిటిషన్ ని పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తుది వాదనలు వినాల్సి ఉందని పేర్కొంటూ.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ ను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.

మంత్రి కొప్పుల ఈశ్వర్ పిటిషన్ కొట్టివేత
X

ప్రజా ప్రతినిధుల ఎన్నిల వ్యవహారంపై వేసిన పిటిషన్లపై విచారణలు ఊపందుకున్నాయి. ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక విషయంలో ఆయన దాఖలు చేసిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది హైకోర్టు. ఈ వ్యవహారంలో తుది వాదనలు వినాల్సి ఉందని పేర్కొంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీచేసిన కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. పరాజయం తర్వాత రీకౌంటింగ్ కి డిమాండ్ చేశారు లక్ష్మణ్. రీకౌంటింగ్ లో కూడా కొప్పుల ఈశ్వర్ కే మెజార్టీ వచ్చింది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ వెనక్కి తగ్గలేదు. రీకౌంటింగ్ లో కూడా తనకు అన్యాయం జరిగిందని న్యాయపోరాటం మొదలు పెట్టారు. కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లక్ష్మణ్ పిటిషన్ ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.

మూడేళ్లపాటు విచారణ..

మూడేళ్ల క్రితం ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. అప్పట్నుంచి విచారణ జరుగుతూనే ఉంది. ఇటీవల విచారణ వేగవంతం కావడంతో కొప్పుల ఈశ్వర్ పిటిషన్ ని కొట్టివేసింది న్యాయస్థానం. మూడేళ్ల పాటు విచారణ జరిగి.. అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక.. ఇప్పుడు మధ్యంతర పిటిషన్ ని పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తుది వాదనలు వినాల్సి ఉందని పేర్కొంటూ.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ ను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.

First Published:  1 Aug 2023 8:17 AM GMT
Next Story