Telugu Global
Telangana

కుట్ర పెద్దది...అందులో కోమటి రెడ్డి చిన్న పావు మాత్రమే

మునుగోడు ఉప ఎన్నిక , మధ్యలో ఎమ్మెల్యేల కొనుగోలు కు కుట్ర...ఈ మొత్తం వ్యవహారంలో అసలు కుట్ర చాలా పెద్దదని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేయడమే బీజేపీ అసలు టార్గెట్ అని, ఇందులో మునుగోడు ఉపఎన్నికకు కారణమైన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చిన్న పావు మాత్రమే అని అర్దమవుతోంది.

కుట్ర పెద్దది...అందులో కోమటి రెడ్డి చిన్న పావు మాత్రమే
X

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఒక్క తెలంగాణనే కాక ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్ లలో కూడా ప్రభుత్వాలను కూల గొట్టి ఆయా రాష్ట్రాలను ఆక్రమించుకునే అతి పెద్ద కుట్ర బైటపడింది.

మునుగోడు ఉప ఎన్నిక , మధ్యలో ఎమ్మెల్యేల కొనుగోలు కు కుట్ర...ఈ మొత్తం వ్యవహారంలో అసలు కుట్ర చాలా పెద్దదని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేయడమే బీజేపీ అసలు టార్గెట్ అని, ఇందులో మునుగోడు ఉపఎన్నికకు కారణమైన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చిన్న పావు మాత్రమే అని అర్దమవుతోంది.

తెలంగాణ ప్రజల్లో పెరుగుతున్న టీఆర్‌ఎస్ ప్రాభవానికి చెక్‌ పెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. బీజేపీ థింక్ ట్యాంక్ వ్యూహం ఏమిటంటే, రాజ్‌గోపాల్ రెడ్డి ఎన్నికల్లో గెలిస్తే, టీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని, బీజేపీకే తెలంగాణ ప్రజల మద్దతు ఉందని ప్రచారం పెద్ద ఎత్తున చేయాలని, ఒక వేళ ఓడిపోతే ఆ ఓటమిని కూడా నైతిక విజయంగా అభివర్ణించవచ్చని బీజేపీ వ్యూహరచన చేసింది, కాంగ్రెస్‌ను మూడో స్థానంలో నిలిపివేస్తే బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుంది. టీఆరెస్ నుండి బీజేపీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళడాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ప్రచారం చేసి ఫిరాయింపులను ప్రోత్సహించడం మరొక ఎత్తుగడ. మరికొంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మరింత మంది టీఆరెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, తద్వారా మిగతా ఎమ్మెల్యేలను ఆకర్శించడం, చివరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నది బీజేపీ భారీ ప్లాన్.

నిందితుల నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన సమాచారం మేరకు రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనా అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి మొదట్లో ససేమిరా అన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే బీజేపీలో చేరుతానని, ఒకవేళ ఫిరాయింపుపై సమస్య వచ్చినా కోర్టును ఆశ్రయించి, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు వాయిదా వేయవచ్చని రాజ్‌గోపాల్‌రెడ్డి వాదన.

కానీ బిజెపి నాయకత్వం రాజీనామాకు పట్టుబట్టింది. అంతే కాదు అతనికి పూర్తి ఆర్థిక‌ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది. చివరకు రాజగోపాల్ రెడ్డి కూడా వందల కోట్లు వెదజల్లడం ద్వారా ఎన్నికల్లో గెలువచ్చనే నమ్మకానికి వచ్చారు. ప్రతిగా, అతనికి కావలసింది న్యూఢిల్లీలోని బీజేపీ హైకమాండ్ నుండి షరతులు లేని మద్దతు.

మరో వైపు మునుగోడు ఎన్నిక లోపే మరికొంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా టీఆరెస్ లో ఓ రకమైన గందరగోళాన్ని, భయాన్ని వ్యాపింపచేయాలన్నది ఆ పార్టీ పెద్దల ప్లాన్.

అయితే, వారు అనుకున్నది ఒకటైతే ప్రజల తీర్పు మరోలా ఉండటంతో ప్లాన్ తలకిందులైంది. ఒకవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బ్రోకర్లు అడ్డంగా బుక్కయిపోవడం, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడంతో వాళ్ళు వదిలిన బాణం తిరిగొచ్చి వాళ్ళకే తగిలింది. ఒక్కమాటలో చెప్పాలంటే, రాజ్‌గోపాల్ రెడ్డి పెద్ద ప్లాన్‌లో చిన్న పావుగా మిగిలిపోయారు.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్‌ చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బీజేపీలో చేరేందుకు ఎమ్మెల్యేలను ఒప్పించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తూనే జగన్‌తో స్నేహపూర్వకంగా వ్యవహరించాలనేది ప్లాన్. జగన్ కు దగ్గరవ్వాలని, మెల్లగా కాళ్ల కింద నుంచి చాప‌ లాగాలని ఏపీలో ప్లాన్ చేసుకున్నారు. ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 55 మందితో సహా 70 మంది నేతలను బీజేపీ సంప్రదించినట్లు సమాచారం.

ఆడియో క్లిప్‌ల ద్వారా వెల్లడైనట్లుగా, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కూడా బీజేపీ రాడార్‌లో ఉంది. ఢిల్లీ ప్రభుత్వంలో 43 మంది, రాజస్థాన్‌లో 21 మంది నేతలను సంప్రదించినట్లు బీజేపీ నేతలు తెలిపారు.

First Published:  14 Nov 2022 3:11 AM GMT
Next Story