Telugu Global
Telangana

రాజగోపాల్ రెడ్డి రాక.. మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం!

ఇప్పటికే ప్రచార రథాలను సిద్ధం చేసుకున్న చలమల్ల.. కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక ప్రకటనతో డీలా పడ్డారని సమాచారం. కోమటిరెడ్డి మునుగోడు నుంచి పోటీ చేస్తాననడం సరికాదని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

రాజగోపాల్ రెడ్డి రాక.. మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం!
X

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేరిక.. మునుగోడు కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. ఆయన మునుగోడు నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతుండడంతో స్థానిక కాంగ్రెస్‌ నేతల్లో కలవరం మొదలైంది. వారంతా రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. టికెట్‌ తనదే అని ఆశలు పెట్టుకున్న చలమల్ల కృష్ణా రెడ్డి ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని సమాచారం. నిన్న మొన్నటి వరకు మునుగోడు టికెట్ చలమల్ల కృష్ణారెడ్డిదే అని ప్రచారం జరిగింది. ఈ మేరకు కృష్ణారెడ్డి ఫైనల్ చేసిన తర్వాతే మండల అధ్యక్షులను నియమించారు.

ఇప్పటికే ప్రచార రథాలను సిద్ధం చేసుకున్న చలమల్ల.. కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక ప్రకటనతో డీలా పడ్డారని సమాచారం. కోమటిరెడ్డి మునుగోడు నుంచి పోటీ చేస్తాననడం సరికాదని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మునుగోడు ఉపఎన్నిక టైంలోనే చలమల్ల టికెట్ ఆశించారు. అయితే అప్పుడు పాల్వాయి స్రవంతికి టికెట్ కేటాయించింది అధిష్టానం. ఇక ఇవాళ చౌటుప్పల్‌లో మండల అధ్యక్షులు, అనుచరులతో చలమల్ల సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.

లెఫ్ట్ పార్టీలతో పొత్తు, రాజగోపాల్‌ రెడ్డి లాంటి నేతల చేరికలతో కాంగ్రెస్‌ రెండో జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా మునుగోడు, మిర్యాలగూడ ఉన్నాయి. మునుగోడు నుంచి సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇక తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు పోటీ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మునుగోడు విషయంలో కాంగ్రెస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

First Published:  26 Oct 2023 5:50 AM GMT
Next Story