Telugu Global
Telangana

'ఈ ముసలోల్ల వల్లే టీఆరెస్ గెలుస్తోంది'... వృద్ధుల మీద రాజ‌గోపాల్ రెడ్డి ఆక్రోశం

వృద్దులపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంవెళ్ళ‌గక్కారు.మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ... ఈ ముసలి వాళ్ళ వల్లే టీఆరెస్ గెలుస్తోందని వేదిక మీదనే అసహనం వ్యక్తం చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ముసలోల్ల వల్లే టీఆరెస్ గెలుస్తోంది... వృద్ధుల మీద రాజ‌గోపాల్ రెడ్డి ఆక్రోశం
X

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కింది. అభ్యర్థులు, వాళ్ళ తరపున ఇతర నాయకుల ప్రచారం ఊపుమీదుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు వివాదాస్పదమవుతున్నాయి. తాను చాలా కాలంగా బీజేపీ టచ్ లో ఉన్నానని, తాను బీజేపీలో చేరడానికి ముందు తనకు 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని ఓ ఛానల్ లో మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశ‌మయ్యాయి, వివాదాస్పదమయ్యాయి. దానిపై ఇతర పక్షాలే కాక ప్రజలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. పేటీఎం తరహాలో పే కాంట్రాక్ట్ అంటూ ఆయనపై మునుగోడు నియోజక వర్గంలో పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ క్రమంలో గ్రామాల్లో తిరుగుతూ సభలు నిర్వహిస్తున్న రాజగోపాల్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు కూడా వివాదాస్పదమవుతున్నాయి.

వృద్దుల గురించి ఓ సభలో రాజగోపాల్ రెడ్డి అవమానకరంగా మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన సభలో మాట్లాడుతుండగా కొంత మంది వృద్దులు కేసీఆర్ కు జైకొట్టారు. తమకు ఆస‌రా పెన్ష‌న్ల‌తో కేసీఆర్ అండ‌గా నిలుస్తున్నారని కొందరు వృద్దులు వాదించారు. దాంతో రాజగోపాల్ రెడ్డి అసహనంతో, ఆగ్రహంతో ఊగిపోయారు.

''ఎక్క‌డి ముస‌లొల్లు రా నాయనా.. ఎక్క‌డ వోయిన మ‌నం స‌స్తున్నాం. ముస‌లొల్లు చేయ‌వ‌ట్టే ఆ కారు గుర్తు రెండు సార్లు వ‌చ్చింది. అవునా? కాదా?'' అంటూ కోమ‌టిరెడ్డి వేదిక మీదినుంచే వ్యాఖ్యానించారు. ఆయన అవునా? కాదా ? ప్రశ్నకు జనాలు జవాబు ఇవ్వలేదు కానీ ఆయనతోపాటు వేదికమీద ఉన్న బీజేపీ నాయకులు మాత్రం అయోమయానికి గురై వారి మొహాలు వాడిపోయాయి.


First Published:  13 Oct 2022 1:35 PM GMT
Next Story