Telugu Global
Telangana

ఐటీ దాడులతో బీజేపీకి సంబంధం..! కిషన్ రెడ్డి ఏమన్నారంటే..?

ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి ముందుగానే ఎలా తెలుసని నిలదీశారు కిషన్ రెడ్డి. జనంలోకి వెళ్లకుండా, మాట్లాడకుండా కొన్ని సంస్థలు సెల్‌ ఫోన్, కంప్యూటర్‌ ల ముందు కూర్చుని సర్వే నివేదికలు ఇస్తున్నాయని, అవన్నీ దొంగ సర్వేలని కిషన్‌ రెడ్డి కొట్టిపారేశారు.

ఐటీ దాడులతో బీజేపీకి సంబంధం..! కిషన్ రెడ్డి ఏమన్నారంటే..?
X

ఐటీ దాడులతో బీజేపీకి సంబంధం..! కిషన్ రెడ్డి ఏమన్నారంటే..?

తెలంగాణలో ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. సరిగ్గా ఎన్నికల వేళ, అది కూడా కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలపై కూడా దాడులు జరిగినా, ఎన్నికల సందర్భంలో మాత్రం కాంగ్రెస్ ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారనే ప్రచారం జనంలోకి బాగా వెళ్లింది. దీనికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని మండిపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

ఐటీ దాడులు దేశంలో ఎక్కడో ఓచోట జరుగుతూనే ఉంటాయని, ఆ డిపార్ట్ మెంట్ ఉన్నదే దాడులు చేయడానికని వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. ఆదాయ పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారని సమాచారం వచ్చిన వారిపై దాడులు చేస్తారని, ఆ దాడులకు బీజేపీకి, కేంద్రానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి ముందుగానే ఎలా తెలుసని నిలదీశారు కిషన్ రెడ్డి. జనంలోకి వెళ్లకుండా, మాట్లాడకుండా కొన్ని సంస్థలు సెల్‌ ఫోన్, కంప్యూటర్‌ ల ముందు కూర్చుని సర్వే నివేదికలు ఇస్తున్నాయని, అవన్నీ దొంగ సర్వేలని కిషన్‌ రెడ్డి కొట్టిపారేశారు. ఈ సర్వేలపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బీజేపీ ప్రచారం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈనెల 11న మరోసారి రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. ఆ తర్వాత కూడా ఆయన మరో రెండుమూడుసార్లు రాష్ట్రానికి వస్తారని చెప్పారు. దీపావళి తర్వాత ఈనెల 13వ తేదీ నుంచి బీజేపీ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తామని అన్నారు. బీఆర్ఎస్ దున్నపోతులను తినేరకం అయితే, కాంగ్రెస్ ఏకంగా ఏనుగులను తినేరకం అంటూ ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి.

First Published:  10 Nov 2023 1:50 AM GMT
Next Story