Telugu Global
Telangana

రాజకీయ బచ్చా, పిట్టలదొర.. ఖమ్మంలో సవాళ్లు

పొంగులేటి ధన బలం చూసుకుని విర్రవీగుతున్నాడని మండిపడ్డారు మంత్రి పువ్వాడ. బీఆర్‌ఎస్‌ లో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేసిన చరిత్ర పొంగులేటిదని ఆరోపించారు.

రాజకీయ బచ్చా, పిట్టలదొర.. ఖమ్మంలో సవాళ్లు
X

ఖమ్మంలో పొలిటికల్ హీట్ మొదలైంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పువ్వాడ్ అజయ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పువ్వాడపై బచ్చాను నిలబెట్టి గెలిపిస్తానని సెటైర్లు వేశారు పొంగులేటి. ఆయన వ్యాఖ్యలపై ఈరోజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి పువ్వాడ.

పొంగులేటి ధన బలం చూసుకుని విర్రవీగుతున్నాడని మండిపడ్డారు మంత్రి పువ్వాడ. బీఆర్‌ఎస్‌ లో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేసిన చరిత్ర పొంగులేటిదని ఆరోపించారు. తనను తాను అతిగా ఊహించుకుంటున్నాడని, ఆయనకు ఓ సిద్ధాంతం, విలువలు లేవని విమర్శించారు. ఏ పార్టీలోకి పోవాలో తేల్చుకోలేని దుస్థితిలో పొంగులేటి ఉన్నాడని ధ్వజమెత్తారు.పేదలను దోచిన దోపిడీదారులే పొంగులేటి పంచన చేరారని విమర్శించారు. పద్ధతి మార్చుకోవాలని సీఎం కేసీఆర్‌ ఎన్నిసార్లు చెప్పినా పొంగులేటి మారలేదన్నారు.

పొంగులేటి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. ఆ విషయం ఆయన చెప్పకపోయినా తాను చెబుతున్నా రాస్కోండి అన్నారు మంత్రి పువ్వాడ. పార్టీ మారిన తర్వాత పొంగులేటికి కేసీఆర్‌ విలువ తెలిసొస్తుందన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా అని, పిట్టల దొర కూడా అని అన్నారు. ఫ్రస్టేషన్‌ లో ఉన్న పొంగులేటి, పిట్టలదొరలాగా రోజూకో వేషం వేస్తున్నాడు. అలాంటి పిట్టలదొర మాటలకు భయపడే రకం తాను కాదన్నారు పువ్వాడ.

బీఆర్‌ఎస్‌లో ఉండి బాగా సంపాదించాడని, ఇప్పుడు అదే డబ్బుతో పొంగులేటి రాజకీయం చేస్తున్నాడని అన్నారు మంత్రి పువ్వాడ. కాంట్రాక్టర్‌ గా పనులు చేయకుండానే వందల కోట్లు బొక్కాడని ఆరోపించారు. పొంగులేటి ఆత్మీయ సమావేశాలకు జనాల స్పందన కరువైందని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధిమీద కొందరు కడుపులో విషం నింపుకున్నారన్నారు.

First Published:  22 May 2023 1:13 PM GMT
Next Story