Telugu Global
Telangana

ఖమ్మం కలెక్టరేట్ కి దేశంలోనే అరుదైన గుర్తింపు.. ఎందుకంటే..?

కలెక్టరేట్ ప్రాంగణంపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు అధికారులు. పార్కింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన షెడ్లపై ఎక్కడా స్థలం వృథా కాకుండా సోలార్ ప్యానెల్స్ ఉంచారు. వీటన్నిటితో ఆ ప్రాంగణం మొత్తంలోని కార్యాలయాలకు కావాల్సిన కరెంటు ఉత్పత్తి అవుతుంది.

ఖమ్మం కలెక్టరేట్ కి దేశంలోనే అరుదైన గుర్తింపు.. ఎందుకంటే..?
X

పూర్తిగా సౌర విద్యుత్ తో పనిచేసే ప్రభుత్వ భవనాల సముదాయంగా ఖమ్మం కలెక్టరేట్ దేశంలోనే అరుదైన రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ విజయవంతంగా మొదలు కాగా.. ఆగస్ట్-15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దీన్ని అధికారికంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. తెలంగాణలో నూతనంగా ఏర్పాటవుతున్న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ (IDOC)లలో ఖమ్మం జిల్లా ప్రాంగణం తన ప్రత్యేకత చాటుకుంది.

కలెక్టరేట్ ప్రాంగణంపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు అధికారులు. పార్కింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన షెడ్లపై ఎక్కడా స్థలం వృథా కాకుండా సోలార్ ప్యానెల్స్ ఉంచారు. వీటన్నిటితో ఆ ప్రాంగణం మొత్తంలోని కార్యాలయాలకు కావాల్సిన కరెంటు ఉత్పత్తి అవుతుంది. జులై 24 న ఇక్కడి ప్రోటోటైప్ సోలార్ పవర్ ప్లాంట్ ని విద్యుత్ గ్రిడ్ తో అనుసంధానం చేశారు. దీంతో ఈ విధానంలో ఉన్న మొట్టమొదటి గ్రీన్ బిల్డింగ్ గా ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణం (IDOC) దేశంలోనే అరుదైన గుర్తింపు సాధించింది. ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఖమ్మం కలెక్టర్ ట్వీట్ చేయగా.. మంత్రి కేటీఆర్ ప్రశంశాపూర్వకంగా రీట్వీట్ చేశారు.


కలెక్టరేట్ ప్రాంగణంలోని సోలార్ ప్లాంట్ సామర్థ్యం 200 కిలోవాట్లు కాగా, దీని ద్వారా రోజుకి 800 యూనిట్ల నుంచి వెయ్యి యూనిట్ల వరకు కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఆఫీస్ ల అవసరానికి పోను మిగతా విద్యుత్ ని గ్రిడ్ కి పంపిస్తారు. IDOC లోని మొత్తం కార్యాలయాలకు నెలకు అయ్యే కరెంటు బిల్లు ఖర్చు 80వేల రూపాయలనుంచి రూ.1లక్ష వరకు ఉంటుందని అంచనా. ఇప్పుడు సోలార్ విద్యుత్ ద్వారా ఈ ఖర్చు మొత్తాన్ని ఆదా చేస్తున్నారు.

First Published:  13 Aug 2023 12:36 PM GMT
Next Story