Telugu Global
Telangana

నేనొక్కడినే రాను.. నా వెంట చాలా వస్తాయి

"కేసీఆర్‌ కామారెడ్డి వస్తున్నాడంటే ఒక్కడే రాడు. కేసీఆర్‌ వెంట చాలా వస్తాయి. కామారెడ్డి పట్టణ, పల్లెల రూపురేఖలు మార్చేసే బాధ్యత కేసీఆర్‌ దే" అని అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ పుట్టిందని చెప్పారు.

నేనొక్కడినే రాను.. నా వెంట చాలా వస్తాయి
X

నేనొక్కడినే రాను.. నా వెంట చాలా వస్తాయి

కామారెడ్డి గడ్డతో పుట్టుక నుంచే తనకు సంబంధం ఉందని, తన కన్నతల్లి పుట్టింది బీవీపేట మండలం పోసానిపల్లి అనే గ్రామంలోనని, తన బాల్యం కూడా ఇక్కడ గడిచిందని అన్నారు సీఎం కేసీఆర్. ఈ రోజు మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం ఆయన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 45 రోజులపాటు ఇక్కడ జలసాధన ఉద్యమం చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు, ఊరూరా తిరిగామని చెప్పారు. కామారెడ్డి మండల బ్రిగేడియర్ గా తాను పనిచేశానని అన్నారు కేసీఆర్.


కామారెడ్డిని జిల్లా చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అది చేసి చూపించామని చెప్పారు కేసీఆర్. మెడికల్‌ కాలేజ్‌ కూడా తెచ్చుకున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్థన్‌ చాలాసార్లు తనను ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరడంతో.. ఈసారి కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నట్టు తెలిపారు కేసీఆర్. కొత్తగా నమోదు చేసుకున్న బీడీ కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తామని కామారెడ్డి సభలో ప్రకటించారు. మానవీయ దృక్పథంతో మనం నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పార్టీల వైఖరిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయ రంగం నాశనమైపోయిందని, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం తిరిగి అభివృద్ధి చెందిందని చెప్పారు. దేశంలోనే 24గంటల కరెంటు వ్యవసాయానికి ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణేనని అన్నారు కేసీఆర్.

నేనొక్కడినే రాను..

"కేసీఆర్‌ కామారెడ్డి వస్తున్నాడంటే ఒక్కడే రాడు. కేసీఆర్‌ వెంట చాలా వస్తాయి. కామారెడ్డి పట్టణ, పల్లెల రూపురేఖలు మార్చేసే బాధ్యత కేసీఆర్‌ దే" అని అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ పుట్టిందని చెప్పారు. తమాషా కోసం ఓటు వేయొద్దని ఆలోచించి ఓటు వేయాలని కామారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజుతో కేసీఆర్ తొలి దశ ప్రచారం ముగిసింది. ఈనెల 13నుంచి రెండో దశ ప్రచార పర్వం ప్రారంభిస్తారు సీఎం. ఈనెల 28వతేదీన కేసీఆర్ గజ్వేల్ బహిరంగ సభతో రెండు విడతల ప్రచారం పూర్తవుతుంది.


First Published:  9 Nov 2023 11:17 AM GMT
Next Story