Telugu Global
Telangana

లిల్లీపుట్ గాళ్ల పార్టీ.. కాంగ్రెస్ పై కేసీఆర్ సెటైర్లు

రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మత్తులు జరుగుతుంటాయని, గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంత మంది లిల్లీపుట్‌ గాళ్లకు అధికారం వస్తుందని ఎద్దేవా చేశారు కేసీఆర్. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తేనే అలాంటి వారికి సురుకు పెట్టినట్టవుతుందని చెప్పారు.

లిల్లీపుట్ గాళ్ల పార్టీ.. కాంగ్రెస్ పై కేసీఆర్ సెటైర్లు
X

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి మాటల తూటాలు పేల్చారు కేసీఆర్. సంగారెడ్డిలో జరిగిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 125 అడుగుల ఎత్తున అంబేద్కర్‌ విగ్రహాన్ని బీఆర్ఎస్ హయాంలో ఆవిష్కరిస్తే.. విగ్రహం పెట్టుకున్న తర్వాత జరిగిన తొలి జయంతి రోజున కనీసం పూలమాల కూడా వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బాబా సాహెబ్ ని అవమానించిందని మండిపడ్డారు. సందర్శకులు కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లకుండా గేట్లు బంద్‌ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.


లిల్లీపుట్..

రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మత్తులు జరుగుతుంటాయని, గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంత మంది లిల్లీపుట్‌ గాళ్లకు అధికారం వస్తుందని ఎద్దేవా చేశారు కేసీఆర్. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తేనే అలాంటి వారికి సురుకు పెట్టినట్టవుతుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. లిల్లీపుట్‌ గాళ్ల పార్టీ సింగూరు నుంచి ఒక్క చుక్క నీరు కూడా మెదక్‌కు ఇవ్వలేదని, సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌లు పెట్టుకున్నా వాటిని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు కేసీఆర్.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ప్రారంభమైందని, ముఖ్యమంత్రి నారాయణపేట సభలో వణికిపోతున్నారని, సీఎం భయం చూస్తే ఏడాది కూడా ఉండేటట్టు లేడని ఎద్దేవా చేశారు కేసీఆర్. ముఖ్యమంత్రి ఉంటాడా వేరే పార్టీలోకి జంప్ అవుతాడా తెలియడం లేదన్నారు. ఇక్కడేమో కాంగ్రెస్‌కు ఓటేయమంటున్న సీఎం, ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటేయాలని ఇంటర్వ్యూలలో చెబుతున్నారని కౌంటర్ ఇచ్చారు.

బీఆర్ఎస్ కి ఎంపీ సీట్లెందుకంటే..?

కొంత మంది బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌ సీట్లు ఎందుకని వితండవాదం చేస్తున్నారని.. వాస్తవానికి ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కే ఎక్కువ ఎంపీ సీట్లు కావాలని వివరించారు కేసీఆర్. మన బిడ్డలు పార్లమెంట్‌లో ఉంటేనే మన హక్కులు నెరవేరతాయన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవకపోతే పార్టీకి ఏమీ కాదని, ప్రజలే నష్టపోతారన్నారు కేసీఆర్. కరెంటు ఉండాలన్నా, పథకాలన్నీ సక్రమంగా అమలవ్వాలన్నా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవాలని తేల్చి చెప్పారు.

First Published:  17 April 2024 2:15 AM GMT
Next Story