Telugu Global
Telangana

రెవెన్యూ డివిజన్‌గా చండూరు.. హామీ నెరవేర్చిన కేసీఆర్‌..!

ఇప్పుడు ప్రభుత్వం చండూరును నూతన రెవెన్యూ డివిజన్‌గా మార్చి.. దీని పరిధిలోకి చండూరు, మునుగోడు, గట్టుప్పల్‌, నాంపల్లి, మర్రిగూడ మండలాలను తీసుకువచ్చింది.

రెవెన్యూ డివిజన్‌గా చండూరు.. హామీ నెరవేర్చిన కేసీఆర్‌..!
X

నల్లగొండ జిల్లాలోని చండూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో చండూరు రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పుడు చండూరును కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది.

ఇప్పటివరకూ చండూరు మండలం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ రెవెన్యూ డివిజన్‌లో పరిధిలో ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం చండూరును నూతన రెవెన్యూ డివిజన్‌గా మార్చి.. దీని పరిధిలోకి చండూరు, మునుగోడు, గట్టుప్పల్‌, నాంపల్లి, మర్రిగూడ మండలాలను తీసుకువచ్చింది. ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేసేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. ఇక దీంతో తెలంగాణలో రెవెన్యూ డివిజన్‌ల సంఖ్య 75కు చేరగా.. నల్లగొండ జిల్లాలో నాలుగుకు పెరిగింది.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉపఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఉపఎన్నికలో బీఆర్ఎస్‌ గెలిస్తే చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అయితే డిసెంబర్‌లో మునుగోడులో కేటీఆర్‌ నేతృత్వంలో పర్యటించిన మంత్రుల బృందం నియోజకవర్గానికి 400 కోట్ల రూపాయలు ప్రకటించింది. చండూరు రెవెన్యూ డివిజన్‌ హామీ మాత్రం పెండింగ్‌లో పెడుతూ వచ్చారు. తాజాగా ఆ హామీ సైతం నెరవేర్చడంతో మునుగోడు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

*

First Published:  4 Sep 2023 3:58 PM GMT
Next Story