Telugu Global
Telangana

కేసీఆర్ సంచలన ప్రకటన‌!

2024 లో ఢిల్లీ పీఠం మీద కూర్చునేది బీజేపీయేతర ప్రభుత్వమే అని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మన ప్రభుత్వం రాగానే దేశ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని వాగ్దానం చేశారు.

కేసీఆర్ సంచలన ప్రకటన‌!
X

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి, బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం రాబోతుంద‌ని, దేశ రైతులంద‌రికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు కేసీఆర్ నిజామాబాద్‌ కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం, టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన‌ మాట్లాడుతూ.. 2024లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం పోరాడడానికే జాతీయ రాజకీయాలను ప్రారంభిస్తున్నానని కేసీఆర్‌ సభాముఖంగా ప్రకటించారు.

తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేశాము. సింగూరు నీళ్లు రాకుండా కుట్ర చేశారు. సింగూరు కాలువల్లో​ నీళ్లు పారాలా?. మతపిచ్చి మంటలతో రక్తం పారాలా? అని ప్రశ్నించారు కేసీఆర్. ప్ర‌పంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో 83 కోట్ల ఎక‌రాల భూమి ఉంది. అందులో 41 కోట్ల ఎక‌రాలు వ్య‌వ‌సాయానికి అనుకూలమైనవి. అనేక జీవ న‌దులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కట్టలేదు. కొత్త ఫ్యాక్ట‌రీ పెట్ట‌లేదు. అన్ని అమ్మడమే త‌ప్ప కొత్త‌ది కట్టింది లేదు. రైతు సంఘాలు, రైతు బిడ్డ‌లు స‌మావేశాలు పెట్టి రైతు వ్య‌తిరేక విధానం అవ‌లంభిస్తున్న పార్టీల‌ను తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు.

''28 రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చిన రైతులు నన్ను దేశ రాజకీయాల్లోని రావాలని కోరుతున్నారు. మనం జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాము. జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని నిజామాబాద్‌ నుంచే ప్రారంభిస్తాను. 2024లో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఢిల్లీ గడ్డ మీద ఎగిరేది మన జెండానే. అప్పుడు దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తాము'' అని స్పష్టం చేశారు కేసీఆర్.

First Published:  5 Sep 2022 2:44 PM GMT
Next Story