Telugu Global
Telangana

మ‌నుషులు 300 ఏళ్లు బతికే రోజులు రాబోతున్నాయ్‌

జేఎన్‌టీయూ హైదరాబాద్‌ 12వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇస్రో చైర్మన్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

మ‌నుషులు 300 ఏళ్లు బతికే రోజులు రాబోతున్నాయ్‌
X

భవిష్యత్తులో మనిషి 300 ఏళ్లు బతికే రోజులు రాబోతున్నాయని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ చెప్పారు. మనిషి శరీరంలోని పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనిషి 200 నుంచి 300 ఏళ్ల వరకు జీవించే అవకాశముంటుందని ఆయన వివరించారు. విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు, భవిష్యత్తులో వచ్చే ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యమయ్యే అవకాశముందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మనిషి సగటు జీవితకాలం 35 సంవత్సరాలుండగా ప్రస్తుతం 70 ఏళ్లుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. శుక్రవారం జరిగిన జేఎన్‌టీయూ హైదరాబాద్‌ 12వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇస్రో చైర్మన్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆ సినిమాలతో పోల్చితే ఇస్రో పరిశోధనలు తక్కువ ఖర్చు..

మన దేశంలో నిర్మిస్తున్న పలు సినిమాలతో పోల్చితే అంతరిక్ష రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో చేస్తున్న పరిశోధనలు తక్కువ ఖర్చుతో పూర్తవుతున్నాయని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ వివరించారు. అంతరిక్షంలోకి మనుషులను పంపే ’మిషన్‌ గగన్‌యాన్‌’ను ఈ ఏడాదిలోపు పూర్తి చేయనున్నామని చెప్పారు. సూర్యగ్రహంపై చేస్తున్న ప్రయోగం శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలవుతుందన్నారు. ఇక ఈ ఏడాది పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీలను గ్రహాల కక్ష్యల్లోకి పంపుతున్నామని, వీటిద్వారా తుపాన్లు, భారీ వర్షాలు ఎప్పుడు, ఎక్కడ వస్తాయన్నది కచ్చితంగా తెలిసే అవకాశాలున్నాయని ఆయన వివరించారు.

రోబోలను సృష్టించండి.. ప్రయోగాల్లో వినియోగించుకుంటాం..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ ప్రభావం ఇప్పటికే చదువులు, పరిశోధనలపై పడిందని గుర్తించాలని సోమనాథ్‌ విద్యార్థులనుద్దేశించి చెప్పారు. రోబోటిక్‌ సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు అత్యాధునిక రోబోలు సృష్టిస్తే వాటిని భవిష్యత్తులో ఇస్రో తరపున అంగారక, శుక్రగ్రహాలపై చేయనున్న ప్రయోగాల్లో వినియోగించుకుంటామని తెలిపారు. ఏదైనా సబ్జెక్ట్‌లో ఫెయిలైతే ఒత్తిడికి గురికావద్దని, తానూ ఒకటి రెండు పరీక్షల్లో ఫెయిలయ్యానని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే అపజయాలు నిజంగా విజయానికి మెట్లేనని అన్నారు.

చంద్రయాన్‌–3 ప్రాజెక్ట్‌ విజయవంతమైందంటూ విశ్వవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని, అంతకుముందు రెండుసార్లు ఫెయిలైన అంశాన్ని అందరూ మర్చిపోయారని గుర్తుచేశారు. అపజయాలను విద్యార్థులు సోపానంగా మలుచుకోవాలని సూచించారు. అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి ప్రదర్శించే విద్యార్థుల కోసం ‘యువిక’ పేరుతో సర్టిఫికెట్‌ కోర్సులను ప్రవేశపెట్టామని, ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలున్నాయని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ వివరించారు.

First Published:  6 Jan 2024 3:07 AM GMT
Next Story