Telugu Global
Telangana

బండి సంజయ్‌ ఒంటరయ్యారా..?

వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి లాంటి సీనియర్‌ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌ గూటికి చేరగా.. రఘునందన్‌ రావు, ఈటల రాజేందర్ ఓ వర్గంగా మారినట్లు తెలుస్తోంది.

బండి సంజయ్‌ ఒంటరయ్యారా..?
X

తెలంగాణ బీజేపీలో బండి సంజయ్‌ ఒంటరయ్యారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీలో బండి వర్సెస్‌ మిగతా సీనియర్లుగా పరిస్థితి మారినట్లు సమాచారం. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించట్లేదు బండి సంజయ్‌. కొన్ని నియోజకవర్గాల్లో మినహా ఆయన పెద్దగా ప్రచారంలోనూ పాల్గొనలేదు.

వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి లాంటి సీనియర్‌ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌ గూటికి చేరగా.. రఘునందన్‌ రావు, ఈటల రాజేందర్ ఓ వర్గంగా మారినట్లు తెలుస్తోంది. తాజాగా రఘునందన్‌ రావు ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ పరోక్షంగా బండి సంజయ్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఒక్కడి వల్ల పార్టీ ఎప్పటికీ గెలవదని.. నేనుంటే అలా ఉండేది.. ఇలా ఉండేదని మాట్లాడడం సరికాదన్నారు. అలా చెప్తున్న వ్యక్తి స్వతహాగా ఎందుకు ఓడిపోయారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో మరోసారి బీజేపీలో విబేధాలు బయటపడ్డట్టయింది. గతంలోనూ రఘునందన్‌ బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు అడపదడపా కలిసి మీడియా ముందుకు వస్తున్నప్పటికీ.. బండి సంజయ్ నియోజకవర్గం దాటి రావడం లేదు. దీంతో ఆయనకు రాష్ట్రస్థాయి లీడర్లకు చెడిందన్న వార్తలు జోరందుకున్నాయి.

First Published:  13 Dec 2023 3:22 AM GMT
Next Story