Telugu Global
Telangana

ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది -కేటీఆర్

గత ఎనిమిదిన్నరేళ్లలో రాష్ట్రానికి రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, TS-iPASS ద్వారా 22 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించామని కేటీఆర్ తెలిపారు.

ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది -కేటీఆర్
X

తెలంగాణ పట్ల‌ కేంద్రం చూపుతున్న వివక్షపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ''రాజకీయంగా తమ ప్రభుత్వంపై ఎంత‌ బురదజల్లుతున్నా, ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం హామీ ఇచ్చినట్లుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. త్వరలో వందే భారత్ కోచ్‌లను కూడా అందుబాటులోకి తెస్తుంది.'' అని ఆయన పేర్కొన్నారు.

గత ఎనిమిదిన్నరేళ్లలో రాష్ట్రానికి రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, TS-iPASS ద్వారా 22 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించామని కేటీఆర్ తెలిపారు.

శుక్రవారం అసెంబ్లీలో ఐటీ, పరిశ్రమల శాఖలపై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు కల్పించలేమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అనేక రంగాలకు సంబంధించిన పారిశ్రామిక పార్కులను నిర్మిస్తోందన్నారు.

తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు జూన్ 2014లో రూ.57,000 కోట్ల నుంచి 2022 జూన్ నాటికి రూ.1.83 లక్షల కోట్లకు పెరిగాయని మంత్రి తెలిపారు. '' రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా టైర్-2 నగరాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధిని వికేంద్రీకరిస్తోంది. అయితే కేంద్రం తెలంగాణను శత్రుదేశంలా పరిగణిస్తూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తోంది. కేంద్రం 163 ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించింది. 9.19 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి లేకుండా చేసింది.'' అని కేటీఆర్ మండిపడ్డారు.

కేంద్రాన్ని ఒప్పించాలని, రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగాల ప్రోత్సాహానికి అవసరమైన సహకారం అందేలా చూడాలని స్థానిక‌ బీజేపీ నేతలను కేటీఆర్ కోరారు. ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించే బదులు ప్రగతి భవన్, రాష్ట్ర సచివాలయం వంటి ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారని, అలాంటి నాయకుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలను కోరారు.

మొత్తం 249 యూనిట్లకు ఆర్థిక సహాయం, 455 యూనిట్లకు కన్సల్టెన్సీ, 466 యూనిట్లకు డయాగ్నస్టిక్ స్టడీ చేసి వాటిని మూసివేత‌ నుండి కాపాడేందుకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌లను స్థాపించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,933 కోట్లు పంపిణీ చేసిందని, కోవిడ్19, ఆర్థిక సంక్షోభం కారణంగా మిగిలిన రూ. 3,400 కోట్లు చెల్లించలేకపోయిందని ఆయన అంగీకరించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఐదు శాతం పన్ను విధించడం ద్వారా చేనేత రంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, అఖిల భారత హస్తకళల బోర్డు, ఆల్ ఇండియా పవర్‌లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఇతర సంస్థలను మూసివేశారని మంత్రి అన్నారు. చేనేత కార్మికులకు పొదుపు నిధి, ఆరోగ్య, జీవిత బీమా పథకాలను కూడా ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. 'సబ్ కా సాథ్, సబ్ కా సత్యనాష్' కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిజమైన నినాదం అని ఆయన అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పుతున్న అన్ని ఐటీ టవర్లలో ఇంక్యుబేషన్ సెంటర్లు, టాస్క్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

First Published:  11 Feb 2023 3:09 AM GMT
Next Story