Telugu Global
Telangana

సికింద్రాబాద్ - విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్?

తొలుత సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్ -బెంగళూరు లేదా ముంబైకి ఈ ట్రైన్ నడపాలని అనుకున్నారు. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కేవలం సీటింగ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది. దీంతో ప్లాన్ మార్చినట్లు తెలుస్తున్నది.

సికింద్రాబాద్ - విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్?
X

తెలుగు రాష్ట్రాల ప్రజలకు త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవలే తెలంగాణకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యూ ఇయర్ కానుకగా వచ్చే ఏడాది నుంచి ఈ సూపర్ ఫాస్ట్, లగ్జరీ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ ట్రైన్‌ను ఏయే రూట్లలో నడపాలనే విషయంపై రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. సికింద్రాబాద్ నుంచే ఈ ట్రైన్ నడపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తొలుత సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్ -బెంగళూరు లేదా ముంబైకి ఈ ట్రైన్ నడపాలని అనుకున్నారు. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కేవలం సీటింగ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది. దూర ప్రాంతాలకు ఇందులో కూర్చొని ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే దగ్గరి ప్రాంతాలకు ఈ రైలు తిప్పాలని నిర్ణయించారు. సికింద్రాబాద్-పూణే మధ్య ఇప్పటికే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. దీంతో సికింద్రాబాద్-విజయవాడ మధ్య దీన్ని నడిపితే అందరికీ సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

హైదరాబాద్, విజయవాడ మధ్య రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతీ రోజు ఎంతో మంది ప్రయాణం సాగిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ రెండు నగరాల మధ్య ఉద్యోగులతో పాటు వ్యాపారులు కూడా ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తే కేవలం 4 గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకునే అవకాశం ఉన్నది. ఖాజీపేట-విజయవాడ మధ్య ఇప్పటికే హైస్పీడ్‌తో రైళ్లు ప్రయాణించేలా ట్రాక్ పటిష్టం జరిగింది. సికింద్రాబాద్-ఖాజీపేట మధ్య త్వరలోనే ట్రాక్‌ను పూర్తి స్థాయిలో పటిష్టం చేయనున్నారు. దీంతో ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఫుల్ స్పీడ్‌తో నడిచే అవకాశాలు ఉన్నాయి.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిపితేనే ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తున్నది. ప్రయాణికుల రద్దీ ఉండటం వల్ల లాభదాయకంగా కూడా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శాతవాహన, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణానికి 6 గంటల సమయం తీసుకుంటున్నాయి. అదే వందే భారత్ అందుబాటులోకి వస్తే కేవలం 4 గంటల్లో చేరుకోవచ్చు. మధ్యలో వరంగల్, ఖమ్మం స్టాప్‌లు ఇస్తే మరింత మంది ప్రయాణికులు ఈ రైలును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. అందుకే రైల్వే శాఖ ఈ రెండు నగరాలను వందే భారత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

First Published:  13 Nov 2022 4:07 AM GMT
Next Story