Telugu Global
Telangana

తెలంగాణ,ఏపీల్లో మాంసాహారులు 97.3 శాతం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మాంసాహారం తినే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో 97.3 శాతం మంది మాంసాహారం తింటున్నారని ఓ సర్వే తేల్చింది. కరోనా కారణంగా మాంసం తినే అలవాటు పెరిగిందట.

తెలంగాణ,ఏపీల్లో మాంసాహారులు 97.3 శాతం
X


జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) 2019 , 2021 డేటా ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు మాంసాహారం తింటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మాంసాహారం తినే వారి సంఖ్య 97.3 శాతానికి పెరిగింది. కేవలం 2.7 శాతం మంది మాత్రమే శాఖాహారం తీసుకుంటున్నారని సర్వే వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్ర జనాభాలో 73 శాతం మంది వారానికి ఒక్కసారైనా మాంసం తింటున్నారని, 4.4 శాతం మంది మాంసం కాకుండా గుడ్లు మాత్రం తింటున్నారని ఈ నివేదిక‌ వెల్లడించింది.

NFHS 2019 , 2021 మధ్య రెండు దశల్లో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 15-49 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న 7,24,115 మంది మహిళలు,93,144 మంది పురుషులలో ఈ సర్వే నిర్వహించింది.

దేశంలో 51 శాతం మంది పురుషులు కనీసం వారానికొకసారి మాంసం తింటారు, స్త్రీలు పురుషుల కంటే తక్కువ సార్లు తింటారు.

ఏపీ, తెలంగాణకన్నా ఎక్కువ శాతం మాంసాహారం తినే రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్ లున్నాయి.

అతితక్కువ మాంసాహారం తినే రాష్ట్రాలు రాజస్థాన్, హర్యాణా, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలున్నాయి.

ఈ తరహా మార్పులకు కారణం కరోనా విజృంభణేనని ఈ సర్వే చెబుతోంది. కరోనా నుంచి రక్షణ కొరకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో అప్పటిదాకా మాంసాహారం ముట్టని వారు కూడా మాంసాహారం తినడం అలవాటు చేసుకున్నారట.



First Published:  22 Oct 2022 12:28 PM GMT
Next Story