Telugu Global
Telangana

మాన‌సిక ఒత్తిడి త‌ట్టుకోలేక ఐఐటీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌..

వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృతురాలు రాసిన సూసైడ్ లెట‌ర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె మృతికి గ‌ల కార‌ణాల‌పై స‌హ‌చ‌ర విద్యార్థినుల‌ను, సిబ్బందిని ఆరా తీశారు.

మాన‌సిక ఒత్తిడి త‌ట్టుకోలేక ఐఐటీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌..
X

మాన‌సిక ఒత్తిడిని త‌ట్టుకోలేక ఐఐటీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న సోమ‌వారం జ‌రిగింది. సంగారెడ్డి శివారులోని కందిలో గల ఐఐటీ హైదరాబాద్‌లో త‌న రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. త‌న మృతికి ఎవ‌రూ కార‌ణం కాద‌ని, మాన‌సిక ఒత్తిడి త‌ట్టుకోలేకే చ‌నిపోతున్నాన‌ని లేఖ రాసి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది.

సంగారెడ్డి రూర‌ల్ ఎస్ఐ రాజ్‌నాయ‌క్‌ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఒడిశాకు చెందిన మ‌మైత నాయ‌క్ (21) అనే విద్యార్థిని ఐఐటీ హైద‌రాబాద్‌లో ఎంటెక్ ఫ‌స్టియ‌ర్ చ‌దువుతోంది. జూలై 26నే ఆమె ఫ‌స్టియ‌ర్‌లో చేరింది. ఇంత‌లోనే ఆమె ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. విద్యార్థులు రాత్రి 10 గంట‌ల‌కు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృతురాలు రాసిన సూసైడ్ లెట‌ర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె మృతికి గ‌ల కార‌ణాల‌పై స‌హ‌చ‌ర విద్యార్థినుల‌ను, సిబ్బందిని ఆరా తీశారు. ఇక్కడే చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి గ‌త నెల 17న అదృశ్య‌మై.. విశాఖ‌ప‌ట్నం బీచ్‌లో ఆత్మ‌హత్య చేసుకున్నాడు. ఆ ఘ‌ట‌న జ‌రిగి 20 రోజులు కూడా కాక‌ముందే మ‌రో ఘ‌ట‌న జ‌రగ‌డం క‌ల‌క‌లం రేపింది.

First Published:  8 Aug 2023 3:31 AM GMT
Next Story