Telugu Global
Telangana

ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటా... కేటీఆర్

మునుగోడు ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే తాను ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గం టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేసిన సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడారు.

ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటా... కేటీఆర్
X

డబ్బులతో ఓటర్లను కొనవచ్చనే ఓ వ్యక్తి అహంకారంతోనే మునుగోడు ఎన్నికలు వచ్చాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గం టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేసిన సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ....ఫ్లోరోసిస్ తో ఇబ్బందులు పడ్డ నల్గొండజిల్లాకు 19 వేల కొట్ల నిధులు ఇవ్వాలని మోడీని అడిగినా పట్టించుకోలేదని, కానీ రాజగోపాల్ రెడ్డి కి మాత్రం 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు.

75 ఏళ్ళుగా పరిష్కారం కాని ఫ్లోరోసిస్ సమస్యను టీఆరెస్ ప్రభుత్వం పరిష్కరించిందని కేటీఆర్ అన్నారు. అన్ని వృత్తులవారి సంక్షేమానికి తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారాయన. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెల్చినప్పటి నుంచి ఆయన మునుగోడుకు రాలేదని, ఈ నియోజకవర్గ అభివృద్దికి ఏమీ చేయలేదని కేటీఆర్ ఆరోపించారు.

టీఆరెస్ ప్రభుత్వం మాత్రమే మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తుందని, టీఆరెస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే తాను ఈ నియోజకవర్గాన్ని దత్తత‌ తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి మునుగోడుకు వచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేస్తానని కేటీఆర్ చెప్పారు.

ఈ సందర్భంగా మోడీ మీద కూడా కేటీఆర్ ద్వజమెత్తారు. 75 ఏళ్ళలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గాలు మోడీ చేశారని ఆరోపించారు. చేనేత మీద పన్నులు వేసిన ఘనత మోడీదేనని ఆయన అన్నారు. నేతన్న సంక్షేమానికి అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టిన టీఆరెస్ కు ఓటేద్దామా కొత్త కొత్త పన్నులు వేస్తున్న మోడీకి వేద్దామా తేల్చుకోండని కేటీఆర్ అన్నారు.

తాను గెలిస్తే మునుగోడుకు వేయి కోట్ల నిధులు ఇస్తానని అమిత్ షా చెప్పాడంటూ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నాడని, దుబ్బాకలో, హుజూరాబాద్ లో కూడా ఇలాంటి అబద్దాలే చెప్పారని, ఎన్నికలు అయిపోయాక అన్నీ మర్చిపోయారని కేటీఆర్ తెలిపారు. శివన్నగూడెం, చెర్ల గూడెం రిజర్వాయర్, కృష్ణరాయనిపల్లి, లక్ష్మణా పల్లిలో రిజర్వాయర్లు కడుతూ ఉంటే ఈ రెండు రిజర్వాయర్లపై కేసులు వేసి అడ్డుపడుతున్నారని, కృష్ణాజలాల్లో మన వాటా తేల్చకుండా ఇబ్బందులు పెడుతున్నారని అలాంటి వారిని ఓడించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

దేశంలోని ప్రజలందరూ జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి అందరి ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తానని మోడీ చెప్పాడని అన్న కేటీఆర్ అలా 15 లక్షలు వచ్చిన వాళ్ళు బీజేపీకి, రాని వాళ్ళు టీఆరెస్ కు ఓట్లు వేయండి అన్నారు.

First Published:  13 Oct 2022 10:17 AM GMT
Next Story