Telugu Global
Telangana

ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడ్ని నేనే..

కేవలం ముఖ్య నాయకులే కాదు, వారి భార్య, లేదా భర్త.. ఫోన్లు కూడా వినేవారని ఆరోపించారు ఈటల. ఫోన్ ట్యాపింగ్ వల్ల కొందరి కాపురాలు కూలిపోయాయని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడ్ని నేనే..
X

"నా ఫోన్ ట్యాప్ చేశారు, నా కుటుంబ సభ్యుల మాటలు దొంగచాటుగా విన్నారు, చివరకు నా డ్రైవర్, వంటమనిషి సహా నా ఇంట్లో ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేశారు." అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఫోన్ ట్యాపింగ్ వల్లే తాను ఈ పరిస్థితుల్లో ఉన్నానన్నారు, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడ్ని తానేనని చెప్పుకొచ్చారు ఈటల. మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫోన్ ట్యాపింగ్ పై స్పందించారు. ఆ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

నాడు కేసీఆర్ కేబినెట్ లోని 17 మంది మంత్రులు ఉంటే.. అందరిపై నిఘా ఉండేదని, సొంత మంత్రులనే నాటి సీఎం నమ్మలేదని సంచలన ఆరోపణలు చేశారు ఈటల. కేవలం ముఖ్య నాయకులే కాదు, వారి భార్య, లేదా భర్త.. ఫోన్లు కూడా వినేవారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల కొందరి కాపురాలు కూలిపోయాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధకరం అని అన్నారు ఈటల. అయితే నేరుగా ఆయన ఎవరిపైనా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయలేదు, గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్ జరిగిందని అన్నారు, దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్..

బీఆర్ఎస్ హయాంలో గెలిచిన ఎమ్మెల్యేలను కాదని.. ఆ పార్టీలో ఉన్న ఓడిపోయిన ఎమ్మెల్యేలతోనే అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు జరిపించేవారని చెప్పారు ఈటల. కనీసం ప్రోటోకాల్ పాటించేవారు కాదని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో ఓడించిన పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్నారని, వారినే రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి బరిలో దింపారని విమర్శించారు ఈటల.

First Published:  7 April 2024 8:37 AM GMT
Next Story