Telugu Global
Telangana

Hyderabad:6 గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు ...లేడీ డాక్టర్ క్షేమం

కిడ్నాప్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జరగగా సాయంత్రం 7గంటలకల్లా పోలీసులు ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని ఛేదించారు. కిడ్నాపర్ల కోసం రాచకొండ పోలీసు కమిషనర్ అనేక బృందాలను రంగంలోకి దించారు.

Hyderabad:6 గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు ...లేడీ డాక్టర్ క్షేమం
X

శుక్రవారం హైదరాబాద్ శివార్లలోని రాఘన్న గూడెంలో సినిమా తరహాలో ఓ యువతి కిడ్నాప్ జరిగింది. డాక్టర్ అయిన ఆ యువతి నిశ్చితార్థం జరుగుతుండగా దాదాపు ఓ 50 మంది ముసుగులు ధరించిన యువకులు ఆ ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించి, అక్కడున్న యువతి బంధువులపై దాడి చేసి యువతిని తీసుకొని వాహనంలో పారిపోయారు.

యువతి తండ్రి, బంధువులు ప్రతిఘటించినప్పటికీ దుండగులను ఆపలేకపోయారు. కనీసం 50మంది యువకులు, వారిలో ఎక్కువ మంది కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లు పట్టుకొని ఇంట్లోకి ప్రవేశించి భీభత్సం సృష్టించారని బంధువులు చెప్తున్నారు.

కిడ్నాప్ కు గురైన వైశాలి అనే లేడీ డాక్టర్ ను ప్రేమించిన నవీన్ రెడ్డి అనే యువకుడు ఈ కిడ్నాప్ చేయించాడని వైశాలి తండ్రి ఆరోపించారు. సమాచారం అందుకున్న ఆదిబట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులను విచారించి ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కిడ్నాపర్లను పట్టుకుని మహిళను రక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

కిడ్నాప్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జరగగా సాయంత్రం 7గంటలకల్లా పోలీసులు ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని ఛేదించారు. కిడ్నాపర్ల కోసం రాచకొండ పోలీసు కమిషనర్ అనేక బృందాలను రంగంలోకి దించారు. ఆ కిడ్నాపర్లు యువతిని తీసుకొని నల్లగొండ జిల్లా వైపు వెళ్ళారని తెలుసుకొని అక్కడి పోలీసులకు సమాచారం అందించారు.

కిడ్నాపర్లు ఆ యువతిని ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకెళ్తుండగా పోలీసులు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో పట్టుకున్నారు. వైశాలిని రక్షించిన పోలీసులు ఆమెతో పాటు ఉన్న 8 మంది కిడ్నాపర్లను అరెస్టు చేశారు. అసలు సూత్రదారి నవీన్ రెడ్డి మాత్రం దొరకలేదు. అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

అయితే పోలీసులు వాళ్ళను పట్టుకునే సమయానికి వైశాలి గాయాలతో కనిపించింది. ఆమెపై కిడ్నాపర్లు దాడి చేసినట్టు ఆమె తెలిపిందని, ఆమె షాక్ లో ఉందని పోలీసులు తెలిపారు.

First Published:  10 Dec 2022 2:35 AM GMT
Next Story