Telugu Global
Telangana

హైద‌రాబాద్ టు అరుణాచ‌లం.. తెలంగాణ టూరిజం పౌర్ణ‌మి యాత్ర

ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే వారు ముందుగా టిక్కెట్ రిజర్వు చేసుకోవాలని టీఎస్‌టీడీసీ విజ్ఞప్తి చేసింది.

హైద‌రాబాద్ టు అరుణాచ‌లం.. తెలంగాణ టూరిజం పౌర్ణ‌మి యాత్ర
X

తిరువ‌ణ్ణామ‌లై.. అరుణాచ‌లం పేరిట ప్ర‌సిద్ధికెక్కిన త‌మిళ‌నాడులోని ఈ శైవక్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఇక ప్ర‌తి నెలా పౌర్ణ‌మి రోజున అరుణాచలంలో జరిగే గిరి ప్ర‌దిక్ష‌ణ‌కు ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం వెళుతున్నారు. ఇందులో తెలుగువారి సంఖ్యా భారీగానే ఉంటోంది. అలాంటి పౌర్ణ‌మి గిరి ప్ర‌దిక్షిణ‌కు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక యాత్ర‌ను తెలంగాణ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ సిద్ధం చేసింది.

ఏప్రిల్‌, మే, జూన్‌ నెల‌ల్లో యాత్ర

ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే వారు ముందుగా టిక్కెట్ రిజర్వు చేసుకోవాలని టీఎస్‌టీడీసీ విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్ 23, మే 22, జూన్ 21 తేదీల్లో పౌర్ణమి వస్తున్న సందర్భంగా ఏప్రిల్ 21, మే 20, జూన్ 19 తేదీల్లో ఈ యాత్రలు నగరం నుంచి ప్రారంభమవుతాయి.

కాణిపాకం, అరుణాచ‌లం, శ్రీ‌పురం

ముందురోజు సాయంత్రం 6.30 గంటలకు బ‌షీర్‌బాగ్‌లోని టీఎస్‌టీడీసీ కార్యాలయం నుంచి ఈ బస్సులు బయలుదేరతాయి. రెండోరోజు ఉదయం 6 గంటలకు నేరుగా కాణిపాకం చేరుకుంటారు. అక్క‌డి నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు అరుణాచ‌లం చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటలకు అరుణచలేశ్వర ఆలయ సందర్శన ఉంటుంది. మూడోరోజు శ్రీపురంలో ఉన్న స్వర్ణ ఆలయాన్ని సందర్శించుకుంటారు. నాలుగో రోజు ఉదయం 4 గంటలకు తిరిగి హైద‌రాబాద్ నగరానికి చేరుకునేలా యాత్ర‌ను రూపొందించారు.

పెద్ద‌ల‌కు రూ.7,500.. చిన్నారుల‌కు రూ.6వేల టికెట్

హైద‌రాబాద్‌- అరుణాచ‌లం యాత్ర‌కు పెద్దలకు మ‌నిషికి రూ.7500, చిన్నారులకు రూ. 6 వేలు చెల్లించాలని టీఎస్‌టీడీసీ తెలిపింది. రవాణా, వసతి మాత్రమే కల్పిస్తామ‌ని.. దర్శనం, భోజనాలు ఎవరికి వారే భరించాల్సి ఉంటుందని తెలిపింది. పూర్తి వివ రాలకు www.tstdc.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల‌ని, టిక్కెట్లు బుక్ చేయాలనుకునేవారు 9848540371 నంబరుకు ఫోన్ చేయాల‌ని తెలిపింది.

First Published:  10 April 2024 5:46 AM GMT
Next Story