Telugu Global
Telangana

హైద‌రాబాద్ మెట్రో రైలు కొత్త రికార్డులు

హైదరాబాద్ మెట్రో రైలు కొత్త రికార్డులు సృష్టించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా నిన్న ఒక్క రోజులోనే మెట్రో రైళ్ళలో 4 లక్షల మంది ప్రయాణించారు.

హైద‌రాబాద్ మెట్రో రైలు కొత్త రికార్డులు
X

హైదరాబాద్ లో కీలకమైన రవాణా వ్యవస్థ మెట్రో రైలు నిన్న కొత్త రికార్డులు సృష్టించింది. నిన్న ఒక్క రోజే మెట్రో రైళ్ళలో 4 లక్షల మంది ప్రయాణించారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా నిన్న భక్తుల సౌకర్యార్థం మెట్రో రైళ్ళు అర్థ‌రాత్రి దాకా మెట్రో సేవలు అందించాయి. దీంతో ఒక్క రోజు అత్యధిక సంఖ్యలో ప్రజలు ప్రయాణించారు. ఈ విషయంలో హైదరాబాద్ మెట్రో దేశం లోనే రికార్డు నెలకొల్పింది.

మియాపూర్‌- ఎల్బీ న‌గ‌ర్ కారిడార్‌లో 2.46 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించగా, నాగోల్‌- రాయ‌దుర్గం కారిడార్‌లో 1.49 ల‌క్ష‌ల మంది, జేబీఎస్‌- ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది ప్ర‌యాణించారు. ఇక ఆయా స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల వివ‌రాల్లోకెళితే... అత్య‌ధికంగా 22 వేల మంది ఖైర‌తాబాద్ స్టేష‌న్‌లో రైలు ఎక్కితే... 44 వేల మంది అదే స్టేష‌న్‌లో రైలు దిగారు. మొత్తానికి 4 లక్షల మంది ఒక్క రోజే ప్రయాణించి రికార్డు సృష్టించడం పట్ల మెట్రో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  10 Sep 2022 11:19 AM GMT
Next Story