Telugu Global
Telangana

చంపేసి ఇన్‌స్టాలో రీల్స్.. హైదరాబాద్‌లో ప్రతీకార హత్య

హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో అర్ధరాత్రి దారుణం జరిగింది. సిద్దూ అనే యువకుడిని కొందకు వ్యక్తులు వెంటాడి మరీ చంపేశారు.

చంపేసి ఇన్‌స్టాలో రీల్స్.. హైదరాబాద్‌లో ప్రతీకార హత్య
X

హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో అర్ధరాత్రి దారుణం జరిగింది. సిద్దూ అనే యువకుడిని కొందకు వ్యక్తులు వెంటాడి మరీ చంపేశారు. 12 సార్లు కత్తులతో పొడిచి, తలపై బండరాళ్లతో మోదీ దారుణంగా హత్య చేశారు. అనంతరం బైక్‌పై వెళుతూ.. రక్తంతో ఉన్న కత్తులు, చేతులను చూయిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేశారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. హత్య విషయం తెలుసుకున్న స్థానికులు.. ఉదయం 4 గంటల టైంలో బాచుపల్లి పోలీసులకు సమచారం ఇచ్చారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలిపారు.

మ్యాటర్‌లోకి వెళ్తే.. ఎస్‌ఆర్‌ నగర్‌లోని దాసారం బస్తీలో గతేడాది అక్టోబర్‌ 23న అంటే.. 5 నెలల కిందట ఓ హత్య జరిగింది. తరుణ్‌ రాయ్‌ అనే యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. పార్టీ అని పిలిచి కత్తులతో పొడిచి, బండరాయితో మోది హత్య చేశారు. ఈ హత్య కేసులో తేజస్‌ (21) అలియాస్‌ సిద్ధూ అనే వ్యక్తి A3 నిందితుడిగా ఉన్నాడు. ఆ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధూనే ఇప్పుడు హత్యకు గురయ్యాడు.

తరుణ్‌ హత్య తరువాత సిద్ధూ జైలుకు వెళ్లాడు. 2 నెలల కిందటే బెయిల్‌ మీద బయటికి వచ్చాడు. ప్రాణభయంతో ప్రగతినగర్‌లో తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో తల దాచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సిద్ధూ తల్లి ఊరెళ్లింది. ఒంటరిగా ఉన్న సిద్ధూ.. తన ఫ్రెండ్స్ మహేశ్‌, శివప్ప, సమీర్‌తో కలిసి మద్యం తాగాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రగతినగర్‌లోని బతుకమ్మ ఘాట్‌ ఎదురుగా నిలబడి ఉన్నాడు. పక్కా స్కెచ్‌ ప్రకారం తరుణ్‌ స్నేహితులు సుమారు 20 మంది బైకులపై వచ్చారు. సిద్ధూను వెంటాడి మరి కత్తులతో పొడిచి, బండరాయితో కొట్టి చంపేశారు. హత్య తర్వాత సెల్ఫీ వీడియో రికార్డ్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. తరుణ్‌ హత్యకు ప్రతీకారంగానే సిద్ధూను చంపి, పగ నెరవేర్చుకున్నామంటూ నిందితులు ఆ పోస్టులో పేర్కొన్నారు.

First Published:  8 April 2024 6:47 AM GMT
Next Story