Telugu Global
Telangana

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇన్‌ల్యాండ్ లెటర్లు ఎక్కడ సంపాదిస్తున్నారు?

రెండు దశాబ్దాల క్రితమే మనుగడలో లేకుండా పోయిన నీలి రంగు ఇన్‌ల్యాండ్ లెటర్లు.. హైదరాబాద్ పోలీసులకు మాత్రం అంత భారీ సంఖ్యలో ఎలా సరఫరా అవుతున్నాయి?

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..  ఇన్‌ల్యాండ్ లెటర్లు ఎక్కడ సంపాదిస్తున్నారు?
X

హైదరాబాద్‌లో వాహనాన్ని జాగ్రత్తగా నడపడమే కాదు, ట్రాఫిక్ ఆంక్షలను పాటించడం కూడా చాలా ముఖ్యం. జంట నగరాల్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందలాది మంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌తో పాటు నిత్యం వేలాది సీసీ కెమేరాల నిఘా ఉంటుంది. ఎలాంటి ఉల్లంఘనకు అయినా ఆటోమెటిక్‌గా ఫొటో తీసి మరీ చలాన్లు వేస్తున్నారు. ఇప్పుడైతే సిగ్నల్ వద్ద గీత దాటినా చలాన్లు వసూలు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నిత్యం ఉల్లంఘనలకు పాల్పడే వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇన్‌ల్యాండ్ లెటర్ల ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. మూడు కమిషనరేట్లలో వేలాది ఇన్‌ల్యాండ్ లెటర్లను చలాన్ల పంపిణీకి పోలీస్ డిపార్ట్‌మెంట్ వాడుతోంది. అయితే, అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. రెండు దశాబ్దాల క్రితమే మనుగడలో లేకుండా పోయిన నీలి రంగు ఇన్‌ల్యాండ్ లెటర్లు.. హైదరాబాద్ పోలీసులకు మాత్రం అంత భారీ సంఖ్యలో ఎలా సరఫరా అవుతున్నాయనే.

భారతీయ పోస్టల్ శాఖ ఇన్‌ల్యాండ్ లెటర్ల అమ్మకాలు దాదాపు నిలిపివేసింది. అయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ కోసం దాదాపు 60 ఏళ్ల పాటు పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లను హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ (రాయల్ మింట్) ముద్రించింది. దేశంలో ఈ ఒక్క ప్రెస్‌లో మాత్రమే ఇన్‌ల్యాండ్ లెటర్లు ముద్రించే వాళ్లు. అప్పట్లో నిత్యం 80 వేల పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లు ముద్రించి.. దేశవ్యాప్తంగా ఉన్న 1.56 లక్షల పోస్టాఫీసులకు సరఫరా చేసేవాళ్లు. ఇప్పుడు మాత్రం పరిమిత సంఖ్యలో మాత్రమే ముద్రించి అవసరం అయిన వారికి సరఫరా చేస్తున్నారు. తెలంగాణ పోలీస్ శాఖ రిక్వెస్ట్ మేరకు రాయల్ మింట్ ప్రతీ నెల భారీ సంఖ్యలో ఇన్‌లెటర్లు ముద్రించి పంపిస్తోంది. అంతే కాకుండా లెటర్లు రాసే అలవాటు ఉన్న చాలా మందికి ఇక్కడ ప్రత్యేకంగా ఇన్‌లెటర్లు అమ్ముతున్నారు.

గతంతో పోల్చుకుంటే పోస్టు కార్డులు, ఇన్‌లెటర్ల వాడకం 90 శాతం పడిపోయింది. అయితే, కొన్ని ప్రభుత్వ శాఖలు మాత్రం పరిమితంగా ఉపయోగిస్తున్నాయి. దేశంలోని చాలా పోస్టాఫీసుల్లో 10 ఏళ్ల క్రితం ముద్రించిన లెటర్లు అలాగే ఉన్నాయి. వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మ్యూజియంలకు పంపిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే తెలంగాణ పోలీస్, ఎల్ఐసీ, పోస్టల్ బ్యాంక్ మాత్రం ఇన్‌ల్యాండ్ లెటర్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఐక్య రాజ్య సమితికి చెందిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ పాలసీలను రూపొందిస్తుంది. పోస్టల్‌కు సంబంధించిన ఏ స్టేషనరీని అయినా బ్యాన్ చేయాలంటే దీని అనుమతి తప్పనిసరి. ఇండియన్ పోస్ట్ కూడా యూపీయూలో సభ్యత్వం కలిగి ఉంది. అందుకే పోస్టుకార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లు పూర్తిగా బ్యాన్ చేయాలంటే ఐక్యరాజ్యసమితికి చెందిన ఆ విభాగానికి రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. దీనికి పార్లమెంటు ఆమోదం, పబ్లిక్ రెఫరెండం కూడా అవసరం. ఇంత ప్రాసెస్ ఎందుకని.. పోస్టల్ శాఖ బ్యాన్ చేయకుండా పరిమిత సంఖ్యలో ముద్రిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవ్వాళ వరల్డ్ పోస్ట్ డే

First Published:  9 Oct 2022 8:11 AM GMT
Next Story