Telugu Global
Telangana

ముస్లింలకు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు..

మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.2,200 కోట్ల బడ్జెట్‌ ను తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు మహమూద్ అలీ. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే అనేక రెట్లు ఇది ఎక్కువ అని చెప్పారు.

ముస్లింలకు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు..
X

తెలంగాణలో ముస్లింలకు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు హోం మంత్రి మహమూద్ అలీ. 50ఏళ్లలో ముస్లింల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదన్నారు. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే ఉన్న రిజర్వేషన్లూ తీసేస్తామంటున్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. తెలంగాణలో ముస్లింలకు మేలు చేసింది బీఆర్ఎస్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో సెక్యులర్ తెలంగాణ కొనసాగుతోందన్నారు. తెలంగాణ భవన్‌ లో మైనార్టీ నేతలతో కలిసి మంత్రి మహమూద్‌ అలీ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో గంగా జమున తెహజీబ్‌ కొనసాగుతోందని చెప్పారు మంత్రి మహమూద్‌ అలీ. సీఎం కేసీఆర్‌ పాలనలో హిందూ ముస్లింలు విభేదాలు లేకుండా కలసి ఉంటున్నారని, సెక్యులర్‌ తెలంగాణకు ఈ పాలన నిదర్శనం అని కొనియాడారు. ముస్లిం బిడ్డల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పేద ముస్లిం ఆడబిడ్డలకు షాదీ ముబారక్‌ ఒక వరమని తెలిపారు. హైదరాబాద్‌ పేద విద్యార్థులకు కూడా విదేశీ విద్య అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 3 వేల మంది విద్యార్థుల విదేశీ విద్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేసిందని తెలిపారు. మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.20 లక్ష స్కాలర్‌ షిప్‌ ఇస్తున్నామన్నారు. ముస్లింలలో వృత్తిదారులకు రూ.లక్ష మైనార్టీ బంధు సాయం అందిస్తున్నామని వెల్లడించారు మహమూద్ అలీ.

మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.2,200 కోట్ల బడ్జెట్‌ ను తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు మహమూద్ అలీ. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే అనేక రెట్లు ఇది ఎక్కువ అని చెప్పారు. తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు మైనార్టీలకు అందుతున్నాయని చెప్పారు. కులం, మతం చూడకుండా అన్నివర్గాలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యమిస్తున్నారని వివరించారు. ముస్లింల మద్దతు కేసీఆర్ కేనని ప్రకటించారు. ఆయన్ను మూడోసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పారు మహమూద్ అలీ.


First Published:  28 Nov 2023 11:30 AM GMT
Next Story