Telugu Global
Telangana

ఈ కేసులో జైలు.. ఆ కేసులో నోటీసులు..

నాంపల్లి కోర్టు ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ రిమాండ్‌ రిజెక్ట్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పోలీసుల పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 16కి వాయిదా వేసింది.

ఈ కేసులో జైలు.. ఆ కేసులో నోటీసులు..
X

పీడీ యాక్ట్ కింద నమోదైన కేసులో రాజాసింగ్ ఆల్రడీ జైలులో ఉన్నారు. అయితే ఇప్పుడు మరో కేసులో ఆయనకు హైకోర్టు నోటీసులిచ్చింది. 41 సీఆర్పీసీ సెక్షన్ కింద ముందస్తు నోటీసులివ్వకుండానే పోలీసులు తనను అరెస్ట్ చేశారని, అందుకే వెంటనే బెయిలివ్వాలని కోరడంతో నాంపల్లి కోర్టు ఆయనకు బెయిలిచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందే విధించిన రిమాండ్‌ని కూడా రద్దు చేసి కోర్టు బెయిలిచ్చింది. దీనిపై తాజాగా పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ రిమాండ్‌ రిజెక్ట్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పోలీసుల పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 16కి వాయిదా వేసింది.

2004 నుంచి రాజాసింగ్‌పై 101 కేసులు ఉన్నాయి. ఇందులో 18 కేసులు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలపై నమోదైనవే. దీంతో తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వీడియో తర్వాత మంగళ్ హాట్, షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో రాజాసింగ్‌ని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు చేసిన సాంకేతిక తప్పు వల్ల ఆయన వెంటనే విడుదలయ్యారు. ఆ తర్వాత పాత కేసులపై వెంటనే షాహినాయత్ గంజ్ పోలీసులు రాజాసింగ్‌కి నోటీసులిచ్చారు. పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో ఆయన తప్పించుకోలేకపోయారు.

ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న రాజాసింగ్‌కి హైకోర్టు నోటీసులు అందించారు పోలీసులు. ఇప్పటికే బీజేపీ ఆయన‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వివరణ కూడా అడిగింది. పార్టీ తనను దూరం చేసుకోదని, వివరణ ఇచ్చిన తర్వాత తిరిగి పార్టీలోనే కొనసాగుతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజాసింగ్. ఆయనపై విధించిన సస్పెన్షన్ పెద్ద డ్రామా అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కావాలనే హైదరాబాద్‌లో మత కల్లోలాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

First Published:  26 Aug 2022 2:42 PM GMT
Next Story