Telugu Global
Telangana

టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌..!

బదిలీల్లో ఏ ప్రాతిపదికన టీచర్లను వేర్వేరుగా చూస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని వివరణ కోరింది కోర్టు. భార్యాభర్తలు ఒకేచోట ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక పాయింట్లు కేటాయించినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.

టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌..!
X

తెలంగాణలో టీచర్ల బదిలీలకు హైకోర్టు ఓకే చెప్పింది. టీచర్ల బదిలీలపై గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టిన ఉన్నత న్యాయస్థానం.. టీచర్‌ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి ఉన్నత న్యాయస్థానం పర్మిషన్‌ ఇచ్చింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది ఈ నిబంధన ఉద్దేశమని స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. పిటిషనర్ల తరఫున చిక్కుడు ప్రభాకర్‌, కృష్ణయ్య వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు వాదనలు వినిపించారు.

బదిలీల్లో ఏ ప్రాతిపదికన టీచర్లను వేర్వేరుగా చూస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని వివరణ కోరింది కోర్టు. భార్యాభర్తలు ఒకేచోట ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక పాయింట్లు కేటాయించినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. బదిలీలకు సంబంధించిన నిబంధనలను సవరించి ఆగస్టు నాలుగో తేదీన అసెంబ్లీ, ఐదో తేదీన శాసన మండలిలో ఉంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు ప్రత్యేక పాయింట్లు కేటాయింపు వివాదానికి సంబంధించిన పిటిషన్లపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్ కుమార్ ధర్మాసనం విచారించింది.

జీవో నెంబర్ 5, 9 లకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించింది. ఉపాధ్యాయుల బదిలీలకు ఈ ఏడాది ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాన్స్‌ఫర్ల మార్గదర్శకాలతో కూడిన జీవో నెంబర్ 5ను జనవరి 25న విడుదల చేసింది. కొన్ని సవరణల తర్వాత ఫిబ్రవరి 7న 9 జీవోను జారీ చేసింది. ఆ తర్వాత షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు కూడా స్వీకరించింది. దీంతో 79 వేలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అయితే బదిలీలు ప్రారంభం కావాల్సిన టైంలో కొందరు బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కేసులు వేశారు. దీంతో నెలల తరబడి టీచర్ల ట్రాన్స్‌ఫర్ లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

*

First Published:  30 Aug 2023 6:19 PM GMT
Next Story