Telugu Global
Telangana

కాకులను వాలనీయనన్నావ్.. గద్దల్ని ఎత్తుకెళ్లావ్

కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి ఏ పార్టీ వారని నిలదీశారు హరీష్ రావు. మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, వరంగల్ అభ్యర్థి కడియం కావ్య, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ ఏ పార్టీ వారని అన్నారు.

కాకులను వాలనీయనన్నావ్.. గద్దల్ని ఎత్తుకెళ్లావ్
X

కేసీఆర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమిలోకి రానీయబోమని చెప్పిన రేవంత్ రెడ్డి.. అదే సమయంలో ఆ ఇంటిమీద కాకి ఈ ఇంటిపై వాలితే తుపాకీతో కాల్చిపారేస్తామని చెప్పారు. కేసీఆర్ ఇంటిపై కాకి, కాంగ్రెస్ గోడమీద వాలినా తమ కార్యకర్తలు తుపాకీతో కాల్చుతారని హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. కాకుల్ని వాలనీయనంటున్న రేవంత్ రెడ్డి.. ఏకంగా గద్దల్ని తీసుకెళ్లారని అన్నారు హరీష్ రావు.


రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ అసత్యాలేనన్నారు హరీష్ రావు. కాకుల్ని వాలనీయనంటున్న ఆయన.. గద్దల్ని తీసుకెళ్లారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి ఏ పార్టీ వారని నిలదీశారు హరీష్ రావు. మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, వరంగల్ అభ్యర్థి కడియం కావ్య, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ ఏ పార్టీ వారని అన్నారు. వారందర్నీ తీసుకెళ్లి ఇప్పుడు కాకుల్ని వాలనీయనంటూ కథలు చెబితే నమ్మేవారెవరున్నారని అన్నారు హరీష్ రావు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ని మరింత బలహీనపరచాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఆ పార్టీలో అభ్యర్థులు ఉన్నా కూడా ఏరికోరి బీఆర్ఎస్ నుంచి నాయకుల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చి పోటీ చేయిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయించడం ఈ జంపింగ్ వ్యవహారానికి పరాకాష్ట. ఈ గోడదూకుళ్లను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అలాంటి వారికి ప్రజలు మద్దతిస్తారా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది.

First Published:  1 May 2024 6:07 AM GMT
Next Story