Telugu Global
Telangana

పాలు, పెరుగుపై జీఎస్టీ.. ఎయిర్ పోర్ట్ పై నో జీఎస్టీ

ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ అనే హ్యాష్ ట్యాగ్ ని తన ట్వీట్ కి జత చేశారు మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టుగా ఇది అమృత కాలం కాదని, దోస్తుల కాలం అని అన్నారు.

పాలు, పెరుగుపై జీఎస్టీ.. ఎయిర్ పోర్ట్ పై నో జీఎస్టీ
X

ఇందుగలడందు లేడని సందేహము వలదు.. అనే పద్యం విష్ణుమూర్తికే కాదు జీఎస్టీకి కూడా వర్తిస్తుంది. ఉప్పు, పప్పు, నూనె, పాలు, పెరుగు.. జీఎస్టీ నుంచి దేనికీ మినహాయింపు లేదు. ఆఖరికి చేనేత ముడి సరుకుపై కూడా జీఎస్టీ విధించి నేతన్నల నడ్డి విరిచింది కేంద్రం. అలాంటి కేంద్రం తనకు నచ్చినవారికి, నచ్చినవాటికి మాత్రం మినహాయింపులిచ్చుకుంటూ వెళ్తుంది. తాజాగా అదానీ గ్రూప్ కి ఎయిర్ పోర్ట్ బదిలీ చేసిన కేంద్రం దానిపై ఎలాంటి జీఎస్టీ లేకుండా మినహాయింపు ఇచ్చింది. పరోక్షంగా అదానీకి గొప్ప మేలు సమకూర్చింది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్ ని అదానీ గ్రూప్‌ కి బదిలీ చేసిన కేంద్రం.. దానిపై ఎలాంటి జీఎస్టీ విధించలేదు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దేశంలో సామాన్య ప్రజలు వినియోగించే పాలు, పెరుగు లాంటి నిత్యావసరాలపై కూడా జీఎస్టీ విధిస్తారని.. కానీ, అదానీ లాంటి అసామాన్యులు ఏకంగా ఎయిర్‌ పోర్టులు పొందినా ఎలాంటి జీఎస్టీ ఉండదని ట్వీట్ చేశారు. ఇలా మిత్రులకు ఇవ్వడం ఉచితం కాదని అంటున్న ప్రధానికి కృతజ్ఞతలు అని సెటైర్లు వేశారు కేటీఆర్.


ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ అనే హ్యాష్ ట్యాగ్ ని తన ట్వీట్ కి జత చేశారు మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టుగా ఇది అమృత కాలం కాదని, దోస్తుల కాలం అని అన్నారు. ప్రధానిలోనే అదానీ ఉన్నారని గుర్తు చేస్తూ అదానీ అనే స్పెల్లింగ్ ని హైలెట్ చేశారు. అదానీ విషయంలో ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటోంది కేంద్రం. తాజాగా జీఎస్టీ మినహాయింపుతో మరోసారి అదానీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ప్రధాని.

First Published:  24 April 2023 10:13 AM GMT
Next Story