Telugu Global
Telangana

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి: ఈ రోజు ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన సీపీఐ

ఇటీవలి కాలంలో గవర్నర్ పదవి కొత్త సమస్యలను, అవాంఛనీయ పరిణామాలను సృష్టిస్తోందని, సరైన ప్రమాణాలు, విధానం లేనందున గవర్నర్ వ్యవస్థ అరాచక వ్యవస్థగా మారిందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె.సాంబశివరావు ఆరోపించారు. కేంద్రంలోని అధికార పార్టీ తమకు అనుకూలంగా పనిచేసే నేతలను గవర్నర్లుగా నియమిస్తుందన్నారు.

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి: ఈ రోజు ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన సీపీఐ
X

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సీపీఐ ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. సీపీఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో 'చలో రాజ్ భవన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె.సాంబశివరావు ప్రజలకు పిలుపునిచ్చారు.

దేశంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో గవర్నర్‌ వ్యవస్థ సమర్థంగా పని చేసిందన్న దాఖలాలు, ఆధారాలు లేవని సాంబశివరావు అన్నారు.

ఇటీవలి కాలంలో గవర్నర్ పదవి కొత్త సమస్యలను, అవాంఛనీయ పరిణామాలను సృష్టిస్తోందని, సరైన ప్రమాణాలు, విధానం లేనందున గవర్నర్ వ్యవస్థ అరాచక వ్యవస్థగా మారిందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని అధికార పార్టీ తమకు అనుకూలంగా పనిచేసే నేతలను గవర్నర్లుగా నియమిస్తుందన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారని సాంబ‌శివరావు గుర్తు చేశారు.

ఇటీవల వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అరెస్ట్‌పై స్పందించిన గవర్నర్‌ రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలను అరెస్ట్‌ చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశించారు. సీపీఐ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 29న దేశవ్యాప్తంగా 'సేవ్ ఫెడరలిజం డే' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సాంబ‌శివరావు తెలిపారు.

First Published:  7 Dec 2022 3:06 AM GMT
Next Story