Telugu Global
Telangana

ఆయనకు చట్టమన్నా, న్యాయస్థానాలన్నా లెక్కలేదా ?

జనవరి 29న హిందుత్వ గ్రూపులు లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా ముంబైలో ఓ భారీ ర్యాలీ, బహిరంగ సభ‌ నిర్వహించాయి. ఈ ర్యాలీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హాజరయ్యారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆయనకు చట్టమన్నా, న్యాయస్థానాలన్నా లెక్కలేదా ?
X

హైదరాబాద్ గోషామహల్ కు చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ కోర్టు ఆదేశాలను ధిక్కరించి మళ్ళీ వివాదాస్పద‌ వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఈ సారి హైదరాబాద్ లో కాకుండా ముంబైలో మాట్లాడారు.

గతంలో విద్వేష వ్యాఖ్యల కేసులో పీడీ యాక్ట్ కింద అరెస్టయిన రాజా సింగ్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు. ఆయనకు విధించిన షరతుల్లో... ఇకపై ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, మతాలను కించపరిచే వ్యాఖ్యలు కూడా చేయవద్దని ఆదేశించింది. అంతేకాకుండా మీడియాతో మాట్లాడరాదని, ర్యాలీలు చేపట్టరాదని కూడా రాజా సింగ్ కు కోర్టు షరతులు విధించింది.

అయితే జనవరి 29న హిందుత్వ గ్రూపులు లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా ముంబైలో ఓ భారీ ర్యాలీ, బహిరంగ సభ‌ నిర్వహించాయి. ఈ ర్యాలీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హాజరయ్యారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ....

''లవ్ జీహాద్ చట్టం మీరు చేయకపోతే చేయడం మాకు వచ్చు, మాకు కూడా తన్నడం వచ్చు. రాబోయే కాలమంతా పోరాటాల కాలమే. బాలా సాహెబ్ ఠాక్రే చెప్పినట్టు ఇప్పుడు హిందువులు గుడిలో గంటలు కొట్టే హిందువులు కాదు. శత్రువులను చితక్కొట్టే హిందువులు. గోవులను చంపిన వారి తలను నరకడమే బాలా సాహెబ్ ఠాక్రే కల.దాన్నినిజం చేసినవాడే నిజమైన హిందువు. లవ్ జీహాదీ, గోహత్య, మత మార్పిడిల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయ‌కపోతే ఈ చిన్న అగ్గిరవ్వలే పెనుమంటలై దేశాన్ని చుట్టుముడుతాయి. శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరికి చంపాడు. ఇప్పుడు అఫ్జల్ ఖాన్ ల సంఖ్య పెరిగిపోతోంది అందుకే ప్రతి ఇంటిలో ఓ శివాజీ తయారు కావాలి. లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా, గోహత్యలకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళకు ప్రభుత్వ‍ం ఆర్థికంగా,భౌతికంగా కూడా అండగా నిలబడాలి. అందరూ ప్రతి వస్తువూ హిందువుల షాపులనుండే కొనండి.ఏ వస్తువు మీదైనా హలాల్ ముద్ర ఉంటే దాన్ని పడేయండి. ఇది ఇస్లాం దేశం కాదు ఇది మా భారత దేశం. త్వరలోనే అఖండ భారత్ అవబోతుంది.'' అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.

ఈ నేపథ్యంలో రాజాసింగ్​కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న ముంబయి ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నోటీసులు జారీ చేసినట్లు మంగళ్​హాట్ పోలీసులు తెలిపారు. ఆ ర్యాలీలో రాజాసింగ్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. హైకోర్టు షరతులు ఉల్లంఘించినందునే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. వీటిపై రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పారు.

తనకు మరోసారి నోటీసులు రావడం పట్ల ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసులు తనను జైలుకు పంపినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. గోహత్య, మత మార్పిడి, లవ్ జిహాద్​పై చట్టం తీసుకురావాలని పదే పదే మాట్లాడుతూనే ఉంటానని రాజాసింగ్ అన్నారు.

First Published:  1 Feb 2023 9:01 AM GMT
Next Story