Telugu Global
Telangana

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. అలవెన్సులు పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు

దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల అలవెన్సులు పెంచినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. అలవెన్సులు పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు
X

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్సులను పెంచుతూ విభాగాల వారీగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ఇచ్చే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ 30 శాతం పెంచింది. అలాగే ఉద్యోగుల ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్సును కూడా 30 శాతం పెంచింది. సెలవు రోజుల్లో పని చేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రూ.150 చెల్లించనున్నారు. ఇక షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ 30 శాతం పెంచింది.

దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీనియన్స్ అలవెన్స్ రూ.2,000 నుంచి రూ.3,000కు పెంచుతూ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కొత్తగా ఇల్లు నిర్మించేే వారికి ఇచ్చే అడ్వాన్ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. అలాగే కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్ పరిమితి రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచింది. మోటార్ సైకిల్ కొనుగోలు అడ్వాన్స్ రూ.80 వేల నుంచి రూ.1 లక్షకు పెంచింది. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల అలవెన్సులు పెంచినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

జీవోలో పేర్కొన్న మరికొన్ని అంశాలు..

- ఉద్యోగుల పిల్లల వివాహాలకు సంబంధించి.. ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్‌ను రూ.1 లక్ష నుంచి రూ.4 లక్షలకు పెంచింది. ఇక కుమారుడి పెళ్లికి రూ.75 వేల నుంచి రూ.3 లక్షలకు అడ్వాన్స్ పెంచింది.

- స్టేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటీవ్‌ను 30 శాతం పెంచింది.

- గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, సీఐడీ, ఆక్టోపస్, యాంటీ నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేను.. 2020 పే స్కేల్ ప్రకారం వర్తింప చేయనున్నారు.

- పెన్షనర్లు మరణిస్తే తక్షణ సాయం రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు.

- ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తించే అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు అదనంగా 15 శాతం స్పెషల్ పే ఉండనున్నది.

కాగా.. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 2.73 శాతం డీఏ ప్రకటించింది. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత ప్రయోజనం కల్పించేలా నిర్ణయం తీసుకొని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









First Published:  23 Jun 2023 10:23 AM GMT
Next Story