Telugu Global
Telangana

కోటి మొక్కలతో గ్రేటర్‌లో హరితహారం

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ పరిధిలో ఈ ఏడాది కోటి మొక్కలు నాట‌డానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ర‌హ‌దారుల వెంట మొక్కలు నాటాలని నిర్ణయించారు.

కోటి మొక్కలతో గ్రేటర్‌లో హరితహారం
X

గ్రేటర్ హైద‌రాబాద్‌ను పచ్చదనంతో నింపేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకోసం కోటి మొక్కలు రెడీ చేస్తున్నారు అధికారులు. వార్డు స్థాయిలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. జోన్‌ల వారీగా ఎక్కడెక్కడ ఎన్నిమొక్కలు నాటాలనే అంశంపై ఇప్పటికే క్లారిటీకి వచ్చారు అధికారులు.

ప్రతి ఏడాది వర్షాకాలంలో హరితహారం కార్యక్రమం నిర్వహించాలనే తెలంగాణ సర్కార్ నిర్ణయానికి అనుగుణంగా వర్షాకాలం రావడానికి ఆరునెలల ముందునుంచే జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అర్బన్ ఫారెస్ట్ విభాగం అధికారులు జోన్ల వారీగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు కావాల్సిన వారు నేరుగా నర్సరీలకు వెళ్లి తీసుకోవచ్చు అంటున్నారు బల్దియా అధికారులు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ పరిధిలో ఈ ఏడాది కోటి మొక్కలు నాట‌డానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ర‌హ‌దారుల వెంట మొక్కలు నాటాలని నిర్ణయించారు. మేజర్ అండ్ మైనర్ రోడ్లతో పాటు కాలనీ రోడ్ల వెంట మొక్కలు నాటేందుకు ప్లాన్‌ చేశామని బల్దియా వర్గాలు అంటున్నాయి. నగరంలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేషన్లను హరితహారంలో భాగస్వాములను చేస్తామంటున్నారు అధికారులు. ఖాళీ స్థలాలు, డబుల్ బెడ్ రూం ప్రాంతాలతోపాటు శ్మ‌శాన వాటికల్లో కూడా మొక్కల నాటాలని నిర్ణయించారు.

గ్రేటర్ పరిధిలోని 6 జోన్లలో ప్రత్యేకంగా కోటి మొక్కలు సిద్దం చేస్తున్నారు అధికారులు. ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో 114 నర్సరీలు, చార్మినార్ జోన్‌లో 90 నర్సరీలు, ఖైర‌తాబాద్ జోన్‌లో 108, శేరిలింగంప‌ల్లి జోన్‌లో 100, కూక‌ట్‌ప‌ల్లి జోన్‌లో 101 నర్సరీలు, సికింద్రాబాద్ జోన్‌లో 107 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నది జీహెచ్ఎంసీ. మొక్కల ప‌రిర‌క్షణ‌లో కార్పొరేట్‌, స్వచ్ఛంద‌ సంస్థలు, కాల‌నీ సంక్షేమ సంఘాలను భాగ‌స్వామ్యం చేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

First Published:  24 Jun 2023 1:35 AM GMT
Next Story