Telugu Global
Telangana

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్రం కట్టుబడి ఉంది - జీ-20 స‌మావేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రి

వ్యవసాయ రంగంలో ఎన్నో అంకుర పరిశ్రమలు వచ్చాయన్నారు. వసుదైక కుటుంబం అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా రైతులందరికీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్రం కట్టుబడి ఉంది - జీ-20 స‌మావేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రి
X

నూతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోవడంలో భారత వ్యవసాయ రంగం ముందంజలో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి అన్నారు. హైదరాబాద్‌లోని HICC వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఈరోజు జీ- 20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఏర్పాటైన వ్యవసాయ ప్రదర్శనను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో నూతన సాంకతిక పరిజ్ఞానాలు క్షేత్రస్థాయి వరకు చేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఎన్నో అంకుర పరిశ్రమలు వచ్చాయన్నారు. వసుదైక కుటుంబం అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా రైతులందరికీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ శాఖలు, ప్రైవేట్ సంస్థలు, ICAR పరిధిలోని వివిధ పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ సంస్థల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. సమావేశాల తొలిరోజైన గురువారం ఉదయం జీ-20 సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. అనంతరం జీ-20 అగ్రి డిప్యూటీస్ సమావేశం జరిగింది. మధ్యాహ్న అగ్రి బిజినెస్‌ను లాభసాటిగా మార్చడం, వ్యవసాయ రంగంలో డిజిటల్ సాంకేతికతను ఉపయోగించడం అనే అంశాలపై చర్చలు జరిగాయి.

శుక్రవారం సమావేశాల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొంటారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ జీ-20 ప్రతినిధులనుద్దేశించి వీడియో సందేశం ఇస్తారు. ఎల్లుండి శనివారం ఆఖరి రోజున జీ-20 ప్రతినిధులు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మిల్లెట్స్ రీసెర్చ్ ను సందర్శిస్తారు. వ్యవసాయ రంగంపై జీ-20 సమావేశాలు ఇప్పటి వరకు ఇండోర్, వారణాసి, చండీగఢ్‌లో జరిగాయి. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే నినాదంతో జీ-20 కూటమికి అధ్యక్షత వహిస్తున్న భారత్ ఆహార భద్రతకు సంబందించిన సవాళ్ళను ప్రపంచ స్థాయిలో పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో జీ-దేశాల భాగస్వామ్యంతో వివిధ స్థాయిలలో జరుగుతున్న పరిశోధన, తీసుకుంటున్న చర్యలను సమన్వయ పరిచేందుకు కృషి చేస్తోంది.

First Published:  15 Jun 2023 12:07 PM GMT
Next Story