Telugu Global
Telangana

ఐఏఎస్‌ అధికారినంటూ నమ్మించి వివాహం.. ఆపై అదనపు కట్నం కోసం వేధింపులు

భర్త ఐఏఎస్‌ సర్టిఫికెట్, రేడియాలజీ సర్టిఫికెట్‌ కూడా నకిలీవని శ్రావణి గుర్తించింది. ఇంత జరిగినా అదనపు కట్నం తెమ్మని వేధిస్తుండడంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది.

ఐఏఎస్‌ అధికారినంటూ నమ్మించి వివాహం.. ఆపై అదనపు కట్నం కోసం వేధింపులు
X

తాను కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యానంటూ ఊరంతా గొప్పగా చెప్పుకొన్నాడు.. ఐఏఎస్‌నంటూ ఓ మ్యాట్రిమోనీలో తన వివరాలు ఉంచాడు.. ఆఖరికి అదే అబద్ధంతో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో తట్టుకోలేకపోయిన భార్య.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడి గుట్టు బట్టబయలైంది. హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

నిందితుడు నల్లమోతు సందీప్‌కుమార్‌ (38) స్వస్థలం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాల. తాను కర్ణాటక ఐఏఎస్‌ కేడర్‌లో ఎంపికయ్యానంటూ అతను 2016లో ఊరంతా గొప్పగా చెప్పుకొన్నాడు. అంతేకాదు ఓ మ్యాట్రిమోనీలో ఐఏఎస్‌నంటూ వివరాలు కూడా ఉంచాడు. దీంతో బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అరిమిల్లి శ్రావణి (34) కుటుంబీకులు అతడిని సంప్రదించారు. 2018లో పెళ్లి చేశారు. ఈ సందర్భంగా రూ.50 లక్షల కట్నం, ఇతర లాంఛనాలు ఇచ్చారు.

అయితే పెళ్లయిన తర్వాత సందీప్‌కుమార్‌ తనకు ఐఏఎస్‌ అధికారిగా పనిచేయడం ఇష్టం లేదని, రేడియాలజిస్టుగా ఉద్యోగం చేస్తానని భార్యకు చెప్పాడు. నిత్యం విధులకు వెళ్లి వస్తున్నట్టు నమ్మించాడు. ప్రస్తుతం మల్లంపేట గ్రీన్‌వ్యాలీ రోడ్డులో వీరు నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. సంపాదనంతా ఏదని ఇటీవల అతన్ని భార్య నిలదీస్తే.. వైద్యం ద్వారా తాను రూ.40 కోట్లు ఆర్జించానని, ఆదాయ పన్ను చెల్లించకపోవడంతో అధికారులు బ్యాంకు ఖాతాను సీజ్‌ చేశారని చెప్పాడు. అవి రావాలంటే రూ.2కోట్లు చెల్లించాలని చెప్పాడు.

అతను చెప్పింది నిజమేనని నమ్మిన భార్య.. తన మిత్రుల ద్వారా ఆ డబ్బు సమకూర్చింది. అయితే ఆ డబ్బును సందీప్‌కుమార్‌ తన తండ్రి విజయ్‌కుమార్‌ (70), అమెరికాలో ఉంటున్న తన సోదరి మోతుకూరి లక్ష్మీసాహితి (35) ఖాతాలకు బదిలీ చేశాడు. ఇక వివాహ సమయంలో ఇచ్చిన ఆభరణాలను తల్లి మాలతి (59) బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. భర్త ఐఏఎస్‌ సర్టిఫికెట్, రేడియాలజీ సర్టిఫికెట్‌ కూడా నకిలీవని శ్రావణి గుర్తించింది. ఇంత జరిగినా అదనపు కట్నం తెమ్మని వేధిస్తుండడంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. మరో నిందితురాలు లక్ష్మీసాహితీ పరారీలో ఉన్నట్టు సీఐ జె.ఉపేందర్‌ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

First Published:  11 July 2024 7:07 AM GMT
Next Story